రాంచీ: త్వరలో జరిగే ఐపిఎల్ టోర్నమెంట్ కోసం చెన్నై సూపర్కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోనీ ప్రాక్టీస్ను ఆరంభించాడు. దుబాయి వేదికగా జరుగనున్న ఐపిఎల్కు ధోనీ ప్రత్యేక ఆకర్షణగా మారిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్కు దూరంగా ఉన్న ధోనీ ఐపిఎల్ ద్వారా రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. దీంతో అందరి దృష్టి ధనాధన్ ధోనీపై నిలిచింది. సుదీర్ఘ విరామం తర్వాత ధోనీ బరిలోకి దిగుతుండడంతో అతని అభిమానుల్లో ఆనందం నెలకొంది. మరోవైపు ధోనీ కూడా ఐపిఎల్పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ టోర్నీలో రాణించడం ద్వారా పూర్వ వైభవం అందుకోవాలని తహతహలాడుతున్నాడు. దీని కోసం ముమ్మర సాధన చేయాలని నిర్ణయించాడు. ఇందులో భాగంగా శుక్రవారం సొంత నగరం రాంచీలో ప్రాక్టీస్కు శ్రీకారం చుట్టాడు. ఇక కరోనా వల్ల దేశవ్యాప్తంగా కఠినమైన లాక్డౌన్ను అమలు చేయడంతో ధోనీ చాలా రోజుల పాటు సాధనకు దూరంగా ఉండాల్సి వచ్చింది. లాక్డౌన్కు ముందు చెన్నైలో ధోనీ ప్రాక్టీస్ ఆరంభించాడు.
అయితే ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో సాధనను ఆపేసి సొంత నగరానికి వెళ్లి పోయాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్లాక్ పక్రియ ఆరంభం కావడంతో ధోనీ సాధనపై దృష్టి పెట్టాడు. కఠోర సాధన ద్వారా ఐపిఎల్కు సమరోత్సాహంతో సిద్ధం కావాలని భావిస్తున్నాడు. దీని కోసం నెట్స్లో శ్రమించేందుకు సిద్ధమయ్యాడు. కాగా, త్వరలో జరిగే ఐపిఎల్ ధోనీకి సవాలుగా తయారైంది. తిరిగి టీమిండియాలో చోటు సంపాదించాలంటే ఈ టోర్నీలో మెరుగ్గా రాణించడం తప్ప మరో మార్గం అతనికి లేదు. ఇందులో విశేషంగా రాణిస్తేనే టీమిండియాలో చేరే అవకాశాలు మెరుగు పడుతాయి. లేకుంటే భారత జట్టులో తిరిగి చోటు సంపాదించడం అతనికి దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కాగా, ఐపిఎల్లో అందరి దృష్టి ధోనీపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ క్రికెట్ బరిలోకి దిగుతున్న మహి ఎలా ఆడుతాడన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందులో ధోనీ ఎంత వరకు సఫలం అవుతాడో వేచి చూడాల్సిందే.
MS Dhoni resume Practice for IPL 2020