ముకేశ్ అంబానీకి వరల్డ్ @4
యూరప్ సంపన్నుడిని అధిగమించిన రిలయన్స్ అధినేత
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరిడిగా ఒక్కో మెట్టు పైకి చేరుకుంటున్నారు. తాజాగా యూరప్కు చెందిన అత్యంత సంపన్నుడి స్థానాన్ని అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ధనవంతుడిగా ముకేశ్ స్థానం దక్కించుకున్నారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ సంపద ఇప్పుడు 80.6 బిలియన్ డాలర్లకు (రూ.6.03 లక్షల కోట్లు) పెరిగింది. ఆయన సంపద ఫ్రాన్స్లోని బెర్నార్డ్ ఆర్నాల్ట్ను మించిపోయింది. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, ముకేశ్ అంబానీ ఎల్విఎంహెచ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీని అధిగమించారు. అంబానీ 80.6 బిలియన్ డాలర్ల నికర విలువతో నాలుగో స్థానంలో నిలిచారు.
ముకేశ్ అంబానీ ఇప్పుడు ఆస్తుల పరంగా ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ (102 బిలియన్ డాలర్లు) దగ్గరికి వచ్చారు. అయితే ఈ వ్యత్యాసం చాలా ఉంది. ఈ జాబితాలో మొదటి స్థానంలో అమెజాన్కు చెందిన జెఫ్ బెజోస్, రెండవ స్థానంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మూడో స్థానంలో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ నాలుగో స్థానానికి చేరారు. ఇటీవల ముకేశ్ అంబానీ నికర విలువ పరంగా పలు వ్యాపారవేత్తలను అధిగమించారు. ఆయన అధిగమించిన వారి జాబితాలో సిలికాన్ వ్యాలీ నుండి ఎలాన్ మస్క్, ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్, లారీ పేజ్ వంటి వారు ఉన్నారు.
Mukesh Ambani became World 4th Richest Person