ముంబయి మెట్రోపాలిటణ కోర్టు ఆదేశం
ముంబయి: తమ సోషల్ మీడియా పోస్టుల ద్వారా రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదుపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్పై కేసు నమోదు చేయవలసిందిగా బాంద్రా మెజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు శనివారం పోలీసులను ఆదేశించింది. తమ ట్వీట్ల ద్వారా మత విద్వేషాలను, ఉద్రిక్తలను సృష్టించడానికి ప్రయత్నిస్తురంటూ క్యాస్టింగ్ డైరెక్టర్, ఫిట్నెస్ ట్రెయినర్ మున్నావరలి సయ్యద్ ఇచ్చిన ఫిర్యాదుపై కంగన, రంగోలీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బాంద్రాలోని మెజిస్ట్రేట్ కోర్టు పోలీసులను ఆదేశించింది.
ఫిర్యాదుదారుడు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత నిందితులు నేరం చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తాను భావిస్తున్నానని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జయదేవ్ ఖులే తన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎలెక్ట్రానిక్ మీడియాకు చెందిన ట్విటర్, ఇంటర్వూలలో చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని వారిపై ఆరోపణలు వచ్చాయని, నిందితులు ట్విటర్ వంటి సోషల్ మీడియాను ఉపయోగించారని ఆయన చెప్పారు. నిపుణులతో క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని, ఈ కేసులో సోదాలు, జప్తులు అవసరమని ఆయన తన ఉత్తర్వులో పేర్కొన్నారు. ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీరుతో పోలుస్తూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయని ఈ ట్వీట్ల వెనుక గల వాస్తవ ఉద్దేశాలను దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందని సయ్యద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమంగా నిర్మించారంటూ ముంబయిలోని తన కార్యాలయంలో కొంత భాగాన్ని కూల్చివేసిన దరిమిలా బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్తో ఘర్షణ పడుతున్న నేపథ్యంలో కంగనపై ఈ కోర్టు ఉత్తర్వులు వెలువడడం గమనార్హం.