ముంబయిలో 700 కేసులే
మూడు నెలల తర్వాత భారీగా తగ్గిన కరోనా కేసులు
73 శాతానికి పెరిగిన రికవరీ రేటు
ఇది శుభవార్తే: ఆదిత్య థాక్రే
ముంబయి: కరోనా కేసుల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్రకు కాస్త ఊరట లభించింది. ముంబయిలో కరోనా తీవ్రత గణనీయంగా తగ్గింది.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ముంబయి పరిధిలో సోమవారం మొత్తం 8,776 పరీక్షలు నిర్వహించగా.. కేవలం 700 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆదిత్య థాక్రే వెల్లడించారు. ముంబయిలో ఒకే రోజు ఇంతపెద్ద సంఖ్యలో టెస్టులు చేయడం ఇదే మొదటిసారని, ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం శుభ పరిణామమని ఆదిత్య థాక్రే పేర్కొన్నారు. మూడు నెలల తర్వాత లభించిన భారీ ఊరట అని అభివర్ణించారు. ప్రస్తుతం ముంబయిలో డబ్లింగ్ రేటు 68 రోజులుగా ఉండగా, రికవరీ రేటు73శాతంగా ఉంది. ముంబయిలో ఈ నెల 20నుంచి 26 వరకు కరోనా కేసుల వృద్ధి రేటు 1.03 శాతంగా ఉంది.
అయితే ముంబయి వాసులు అజాగ్రత్తగా ఉండరాదని, మాస్కులు పెట్టుకోవడాన్ని తగ్గించవద్దని, కేవలం నంబర్లను మాత్రమే తగ్గించాలని ఆయన కోరారు. సోమవారం మహారాష్ట్ర మొత్తం మీద 7,924 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 227 మరణాలు చోటు చేసుకున్నాయి. కాగా, ముంబయిలో 1,021 కేసులు, 39 మరణాలు నమోదైనాయి. కరోనా తీవ్రత అధికంగా ఉన్న మూడు రాష్ట్రాల్లో క్రితం రోజుతో పోలిస్తే మంగళవారం కేసులు సంఖ్య తగ్గడంతో దేశవ్యాప్తంగా నమోదైన కేసులు కూడా తగ్గాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీలో సోమవారం 1075 కేసులు నమోదు కాగా, మంగళవారం ఆ సంఖ్య దాదాపు 42 శాతం అంటే 613కు ఆ సంఖ్య తగ్గింది. అలాగే ఎపిలో 20శాతం అంటే 7,627నుంచి 6,051కి, మహారాష్ట్రలో 16 శాతం అంటే 9,431నుంచి 7,924కు కేసులు తగ్గాయి. కాగా జూన్ 18న 3.33 శాతం ఉన్న కొవిడ్ మరణాల రేటు మంగళవారం నాటికి 2.25 శాతానికి తగ్గినట్లు కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Mumbai sees 700 lowest Corona Cases in day