హైదరాబాద్: తెలంగాణలో ముస్లింలంతా కచ్చితంగా లాక్డౌన్ పాటించాలని ఎంపి అసదుద్దీన్ ఒవైసి తెలిపారు. కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఒవైసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరి సురక్ష కోసమే లాక్డౌన్ ప్రకటించిందన్నారు. మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని ఎంపి పేర్కొన్నారు. మీరంతా శుక్రవారం ప్రార్థనల కోసం మసీదులకు వెళ్లకండని, మీ ఇండ్లలోనే నమాజు చేయాలని సూచించారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కూడా ఇదే నిర్ణయం తీసుకుందని, మసీదుల్లో ముగ్గురు మాత్రమే ప్రార్థనలు చేయాలని ఆల్ ఇండియా లా బోర్డు నిర్ణయం తీసుకుందని, దాన్ని మనమంతా పాటించాలన్నారు. ముస్లింలందరినీ తమ నివాసాల్లోనే నమాజ్ ఆచరించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా ప్రబలుతోందని, ఈ సమయంలో మసీదులకు వెళ్లడం, గుమికూడడం అత్యంత ప్రమాదకరమని ఒవైసి హెచ్చరించారు. శుక్రవారం ప్రార్థనలే కాదు… రోజు చేసే నమాజులు కూడా ఇంట్లోనే చేయాలన్నారు. తాను కూడా మా ఇంట్లోనే నమాజు చేస్తున్నానని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీసుకుంటున్న చర్యలకు మనం మద్దతుగా నిలవాలని సూచించారు. అమెరికా, చైనా లాంటి దేశాలు కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరినీ కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయని, కచ్చితంగా ఆచరించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. భారత దేశంలో ఇప్పటి వరకు 753 మందికి కరోనా వైరస్ సోకగా 18 మంది మృత్యువాతపడ్డారు.