Thursday, April 18, 2024

నాగాలాండ్‌లో పాగా వేసేదెవరు?

- Advertisement -
- Advertisement -

ఈనెల 27న ఎన్నికలు జరగనున్ననాగాలాండ్‌లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఏ ఒక్కపార్టీ కూడా మొత్తం 60 నియోజక వర్గాలకు అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితులున్నాయి. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా, జాతీయ పార్టీల ఉనికి నామమాత్రమే.అకులుటో నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొన్ని రోజుల కిందట నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

దీంతో అక్కడ బిజెపి అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 59 నియోజక వర్గాలకు ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్నాయి.నాగాలాండ్‌లో ప్రస్తుతం నేషనల్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపి పి), బిజెపి కూటమి అధికారంలో ఉంది. ఎన్‌డిపిపి 40 సెగ్మెంట్లలో పోటీ చేస్తుంటే, బిజెపి 19 నియోజకవర్గాల్లో బరిలో ఉంది. గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉంది. ఈ డిమాండ్ ఎన్‌డిపిపి, బిజెపి కూటమి ఇప్పటి వరకు ఒక స్పష్టతకు రాలేదు. నాగాలాండ్‌లో గిరిజన ప్రాబల్యం ఎక్కువ.20 నియోజక వర్గాల్లో 7 గిరిజన తెగలున్నాయి.ఈ తెగలన్నీ గ్రేటర్ నాగాలాండ్ ఏర్పాటును కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజనుల మద్దతు తమకు లభిస్తుందా లేదా అని ఎన్‌డిపిపి, బిజెపి కూటమి మల్లగుల్లాలుపడుతోంది.

అయితే ఈకూటమికి కలిసొచ్చే అంశాలూ లేకపోలేదు. సిఎం నిఫుయో రియోకు సామాన్య ప్రజల్లో గుడ్‌విల్ ఉంది. సమర్థుడైన నాయకుడిగా ఆయన పేరుతెచ్చుకున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో 26 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పి ఎఫ్) అవతరించింది.అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో 26 మంది కొత్త ఎంఎల్‌ఎలలో 21 మంది ప్రత్యర్థి నేషనల్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీలోకి చేరిపోయారు. ఒకరు బిజెపి శిబిరంలోకి వెళ్లిపోయారు. దీంతో ఎన్‌పిఎఫ్‌కు కేవలం నలుగురు ఎంఎల్‌ఎ లే మిగిలారు. ప్రస్తుతం ఎన్‌పిఎఫ్ 22 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది.మరే ఇతర పార్టీతోనూ పొత్తు కూడా పెట్టుకోలేదు.

హంగ్ అసెంబ్లీ అంటూ ఏర్పడితే కింగ్‌మేకర్ అవుతామన్న ధీమా ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే 23 సీట్లలో పోటీ చేస్తుంది. రాష్ట్ర జనాభాలో 88 శాతం క్రిస్టియన్లు ఉన్నారు. ఈ ఓటు బ్యాంక్‌పై కాంగ్రెస్ బోలెడు ఆశలు పెట్టుకుంది. అయితే కిందటిసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కిందటిసారి ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ 2సీట్లు గెలుచుకుంది. జెడి(యు) ఒక సెగ్మెంట్ లో విజయం సాధించింది. ప్రస్తుతం ఎన్‌పిసి 12 స్థానాల్లోనూ, జెడి(యు) 7చోట్ల పోటీచేస్తున్నా యి. అలాగే ఎల్‌జిపి 15 సీట్లలోనూ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 12 సీట్లలోనూ, ఆర్‌పిఐ అఠావలే గ్రూపు 9 నియోజకవర్గంలోనూ, ఆర్‌జెడి 3 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తున్నాయి. సిపిఐ, రైజింగ్ పీపుల్స్ పార్టీ, ఒక్కో నియోజకవర్గంలో పోటీలో ఉన్నా యి. వీరితో పాటు 19 మంది ఇండిపెండెంట్లు కూడా పోటీ చేస్తున్నారు.

* ఎస్. అబ్దుల్ ఖాలిక్
63001 74320

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News