Friday, April 19, 2024

ఎవరీ నవీన్‌రెడ్డి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తాను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం కుదిరిందని, శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మన్నెగూడలోని ఆమె నివాసంలో నిశ్చయ తాంబూలాలకు ముహూర్తమని నవీన్‌రెడ్డికి తెలిసింది. పెళ్లికొడుకు, బంధువులు రాకముందే ఉదయం 11 గంటలకు 5 కార్లు, డీసీఎం, ద్విచక్ర వాహనాల్లో సుమారు 100 మందితో నవీన్‌రెడ్డి.. యువతి ఇంటిపై దాడి చేశాడు. ఫర్నిఛర్‌ను, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఫోన్లు పగలగొట్టారు. అడ్డొచ్చిన యువతి తండ్రిని తీవ్రంగా కొట్టారు. తల్లిని పక్కకు నెట్టారు. ఓ బంధువుని ఇనుపరాడ్లతో కొట్టారు. యువతిని నవీన్‌రెడ్డి కారులో అపహరించుకు పోయాడు. సుమారు 40 నిమిషాల్లోనే ఇదంతా ముగిసింది. పక్కా రెక్కీతో అపహరణ జరిగినట్టు తెలుస్తోంది.

ఈ ఉదంతంతో యువతి తండ్రి దామోదర్‌రెడ్డి, బంధువులు సాగర్‌ రహదారిపై బైఠాయించారు. మన్నెగూడలో నిందితుడి టీ దుకాణాన్ని తగులబెట్టారు. ఆదిభట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీఐను సస్పెండ్‌ చేయాలని నినాదాలు చేశారు. నవీన్‌రెడ్డిపై ఫిర్యాదు చేసినపుడు పోలీసులు అతడికే మద్దతు పలికినట్లు తండ్రి ఆరోపించారు. కిడ్నాప్‌ సమయంలో డయల్‌ 100కు ఫోన్‌ చేసినా గంట వరకు పోలీసులు రాలేదన్నారు.

ఎవరీ నవీన్‌రెడ్డి..

కుడుదుల నవీన్‌రెడ్డి(29) అలియాస్‌ కేఎన్‌ఆర్‌ విజయవాడలో సీఏ ఇంటర్‌ చేసిన తర్వాత వ్యాపారం వైపు అడుగులు వేశాడు. మిస్టర్‌ టీ స్థాపించాడు. దేశవ్యాప్తంగా 400 వరకూ ఫ్రాంచైజీలు ఇచ్చాడు. హస్తినాపురంలో ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేశాడు. స్వగ్రామంలో అతడికి ఇల్లుతో పాటు 4ఎకరాల భూమి ఉంది. తండ్రి కోటిరెడ్డి వ్యవసాయం చేసే వాడని, 6 నెలల క్రితం తల్లిదండ్రులను సైతం మన్నెగూడలోని ఇంటికి తీసుకెళ్లినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులతో నవీన్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News