హాజరైన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్
చండీగఢ్: పంజాబ్ పిసిసి నూతన అధ్యక్షునిగా నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సిద్ధూ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరుకావడం విశేషం. రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొన్న కార్యక్రమంలో సిద్ధూతోపాటు కొత్తగా నియమితులైన రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు సంగత్ సింగ్ గిల్జియాన్, సుఖ్వీందర్ సింగ్ డ్యానీ, పవన్ గోయల్, కుల్జీత్ సింగ్ నగ్రా కూడా బాధ్యతలు స్వీకరించారు. పంజాబ్ వ్యవహారాల ఎఐసిసి ఇన్చార్జ్ హరీష్ రావత్, మాజీ ముఖ్యమంత్రి రాజేందర్ కౌర్ భట్టల్, పార్టీ సీనియర్ నాయకులు ప్రతాప్ సింగ్ బజ్వా, లాల్ సింగ్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సిద్ధూ ప్రసంగిస్తూ పంజాబ్లోని కాంగ్రెస్ కార్యకర్తలందరూ నేడు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులయ్యారని, నాయకుడికి, కార్యకర్తకు మధ ఎటువంటి తేడా ఉండదని అన్నారు. కార్యకర్తలే పార్టీకి ఆత్మలాంటివారని, వారి శక్తితోనే పార్టీ నడుస్తుందని సిద్ధూ తెలిపారు. తనకు జూనియర్ల పట్ల ప్రేమ, సీనియర్ల పట్ల గౌరవం ఉన్నాయని ఆయన అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ గెలుస్తుంది..పంజాబీలు గెలుస్తారు అంటూ ఆయన నినదించారు. అంతకుముందు&పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు సిద్ధూ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ను పంజాబ్ భవన్లో కలుసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో వేదికపైన వారిద్దరూ పక్కపక్కనే ఆశీనులయ్యారు.
Navjot singh sidhu takes over as punjab pcc chief