ముంబయి: కరోనా రోగుల చికిత్సలో అత్యవసరమైన ఆక్సిజన్, రెమిడెసివర్ మందుకు ఏర్పడిన కొరతపై ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్లో వివరించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రయత్నించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్లో ప్రచారం కోసం వెళ్లినందున ఆయన అందుబాటులో లేకుండాపోయారని మహారాష్ట్ర మైనారీటీ వ్యవహారాల మంత్రి నవాబ్ మాలిక్ శనివారం తెలిపారు. ఆక్సిజన్, రెమిడెసివర్ కొరతపై ప్రధానికి ఫోన్లో తెలియచేసేందుకు ఉద్ధవ్ థాక్రే ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన బెంగాల్ పర్యటనలో ఉన్నారని ప్రధానమంత్రి కార్యాలయం చెప్పిందని నవాబ్ మాలిక్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రజలు చస్తుంటే ప్రధాని మోడీ మాత్రం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని ఆయన ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో రాజకీయ పార్టీలన్నీ భారీ బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహిస్తూ రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి కారణం నువ్వంటే నువ్వంటూ పరస్పరం నిందించుకుంటున్న తరుణంలో నవాబ్ మాలిక్ ఈ ఆరోపణలు చేశారు. అయితే, నవాబ్ మాలిక్ ఆరోపణలను ప్రధానమంత్రి కార్యాలయం(పిఎంఓ) ఖండించింది. కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరా పరిస్థితిపై ప్రధాని మోడీ శుక్రవారం స్వయంగా అధికారులతో సమీక్షించారని, రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం నిత్యం సంప్రదింపులు జరుపుతోందని పిఎంఓ వివరించింది.
Nawab Malik slams PM Modi over Corona Vaccine