నగదు సంక్షోభం మరింత పెరగొచ్చు
కరోనా వైరస్ కారణంగా ఆస్తుల నాణ్యత దెబ్బతింటోంది
మూడీస్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: కోవిడ్ -19కు సంబందించిన అంతరాయాల వల్ల నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బిఎఫ్సి) మరింత నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ నివేదిక పేర్కొంది. ఎన్బిఎఫ్సిల ఆస్తుల నాణ్యతను మరింత దిగజారనుందని, దీంతో ఎన్బిఎఫ్సిల పరిస్థితి అధ్వాన్నంగా మారనుందని నివేదిక తెలిపింది. కోవిడ్ -19ను అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలిగిందని, ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న మాంద్యం -మరింత పెరిగే అవకాశం ఉందని మూడీస్ తెలిపింది.
ఇది ఎన్బిఎఫ్సిల ఆస్తి నాణ్యతను నేరుగా ప్రభావితం చేస్తుంది. మాంద్యం వల్ల ప్రజల ఆర్థిక సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఎన్బిఎఫ్సి రుణాన్ని తిరిగి చెల్లించడంలో వినియోగదారులు ఇబ్బందుల్లో పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. మూడీస్ నివేదిక ప్రకారం, అధిక రిస్క్ ఉన్న ప్రాంతాలకు రుణాలు అందిస్తున్నందున ఎన్బిఎఫ్సిల ఆస్తి నాణ్యత బ్యాంకుల కంటే ఎక్కువగా ప్రభావితమవుతుంది.
సెప్టెంబర్ 2018లో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ చెల్లింపులో విఫలమైన తర్వాత ఎన్బిఎఫ్సిల నగదు సంక్షోభం పెరిగింది. ఇప్పుడు కోవిడ్ -19 మహమ్మారి ఎన్బిఎఫ్సిలకు ఈ సమస్యను మరింత పెంచుతుంది. అదనంగా ఆర్బిఐ(భారతీయ రిజర్వ్ బ్యాంక్) వివిధ రుణ వాయిదాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం (తాత్కాలిక నిషేధం ఎంపిక) ఇవ్వడం వల్ల సమీప కాలంలో ఎన్బిఎఫ్సిల నగదు పరిస్థితి మరింత తీవ్రంగా మారవచ్చు.