డ్రగ్స్ కేసులో దీపిక, సారా అలీఖాన్, రకుల్, శ్రద్ధాకపూర్లకు ఎన్సిబి నోటీసులు
విచారణకు రావాలని ఆదేశాలు
నిర్మాత మధు మంతెన నుంచి స్టేట్మెంట్
ముంబై : బాలీవుడ్ను కుదిపేస్తున్న మాదక ద్రవ్యాల రాకెట్కు సంబంధించి నలుగురు ప్రముఖ అందాల హీరోయిన్లకు మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సిబి) సమన్లు జారీ చేసింది. టాప్ హీరోయిన్లుగా వెలుగులో ఉన్న దీపిక పదుకొణె, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్లకు బుధవారం ఈ సమన్లు పంపించారు. నటుడు సుశాంత సింగ్ రాజ్పుత్ మరణం వ్యవహారం పలు మలుపులు తిరిగి ఎట్టకేలకు బాలీవుడ్ వెండితెరవెనుక చీకటి సామ్రాజ్యంగా విస్తరించుకున్న డ్రగ్స్ రాకెట్ మరకల మెరుపులను వెలుగులోకి తెచ్చింది.
పద్మావతి ఇతర సినిమాలతో ఇప్పుడు బాలీవుడ్లో నెంబర్ 1గా రాణిస్తోన్న దీపిక, బాలీవుడ్తో పాటు టాలీవుడ్, ఇతర భాషా సినిమాల్లో తళుకుబెళుకుల హీరోయినగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, అనతికాలంలోనే పాపులార్టీ రేంజ్ సాధించుకున్న సారా, శ్రద్ధాలకు బుధవారం వెలువరించిన సమన్లలో వారు తమ ముందుకు రావాల్సిన తేదీలను ఖరారు చేశారు. దీని మేరకు దీపిక పదుకొనే ఈ నెల 25వ తేదీన ,శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్లు ఈ నెల 26వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఎన్సిబి ఆదేశించింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కేవలం 24 గంటల వ్యవధిలోనే అంటే గురువారం తమ ముందు విచారణకు రావాలని తెలిపారు.
ఉడ్తా పంజాబీ నిర్మాత నుంచి స్టేట్మెంట్
అంతకు ముందు బుధవారం సంస్థ అధికారులు సినిమా నిర్మాత మధు మంతెన నుంచి ఈ కేసుకు సంబంధించి కొన్ని సాక్షాలు సేకరించి, స్టేట్మెంట్ తీసుకున్నట్లు వెల్లడైంది. సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి పలు అనుమానాలు తలెత్తడంతో సాగిన దర్యాప్తు క్రమంలో ఇప్పటికే పలు దఫాలుగా ప్రముఖ నటి రియా చక్రవర్తిని ఎన్సిబి విచారించి , తరువాతి క్రమంలో అరెస్టు చేసింది, ఆమె నుంచి ఇతరత్రా కొందరు నటుల నుంచి తెలిసిన వివరాల ఆధారంగానే ఇప్పుడు ఈ నటీమణులకు సమన్లు వెలువరించినట్లు వెల్లడైంది. సమన్లు వెలువడ్డ వారిలో దీపిక ప్రస్తుతం గోవాలో షూటింగ్లో ఉన్నారు. ఇతర హీరోయిన్లు కూడా బిజీగా ఉన్నట్లు తెలిసింది. రకుల్ ఇప్పుడు హైదరాబాద్లో ఓ సినిమా షూటింగ్లో ఉన్నారు. వీరంతా కూడా తమ లాయర్లను సంప్రదిస్తున్నట్లు, ప్రస్తుత సమన్లను ఏ విధంగా ఎదుర్కొవాలనేది ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటికే విచారించిన ప్రొడ్యూసర్ మధు మంతెన 2016 బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబీ సహ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా మాదకద్రవ్యాల ఇతివృత్తంతోనే వచ్చింది. సుశాంత్ మేనేజర్ జయ సహాను ఎన్సిబి ఇంటరాగేట్ చేసిన దశలోనే మంతెన పేరు కూడా వెలుగులోకి వచ్చింది. దీనితో ఇప్పుడు ఆయన వాంగ్మూలం తీసుకున్నారని వెల్లడైంది. నటీమణులను తమ ముందుకు రావల్సిందిగా పిలిచిన ఎన్సిబి పలు అంశాల గురించి వారి నుంచి ఆరా తీస్తుందని భావిస్తున్నారు. గత రెండు రోజులుగా సుశాంత్ మేనేజర్ను సంస్థ వివిధ కోణాలలో విచారిస్తూ వస్తోంది. మంగళవారమే ఎన్సిబి పదుకొణే మేనేజర్ కరిష్మా ప్రకాశ్కు, క్వాన్ ట్యాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సిఇఒ ధుర్వ్ చిట్గోపెకర్కు సమన్లు వెలువరించింది. అయితే వారు అనారోగ్య కారణాలతో హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. రాజ్పుత్ మరణానికి డ్రగ్స్కు లింక్లు ఉన్నాయని తేలడంతో ఎన్సిబి ఈ కోణంలో విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టింది.
రియాచక్రవర్తిని ఈ కేసుకు సంబంధించి ఇంటరాగేట్ చేసిన దశలోనే ఆమె ఈ నెల 6 8 తేదీలలో ఈ ముగ్గురు నటిల పేర్లు మరికొందరు దక్షిణాది చిత్ర ప్రముఖుల పేర్లు వెల్లడించినట్లు ఎన్సిబి తెలిపింది. కేసుకు సంబంధించి ఈ నెల ఆరంభంలోనే ఎన్సిబి ముంబై, గోవాలకు చెందిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. బాంద్రా నివాసిగా గుర్తించిన కరమ్జిత్ సింగ్ ఆనంద్ అలియాస్ కెజెను ఎన్సిబి తొలుత అరెస్టు చేసింది. ఆయన నుంచి మాదకద్రవ్యాలైన మరిజూనా, హాషిష్లను స్వాధీనం చేసుకుంది. ఈ వ్యక్తి బాలీవుడ్ నటిలకు, చిత్ర పరిశ్రమల్లో పార్టీలకు డ్రగ్స్ గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నట్లు కనుగొన్నారు. కరమ్ జీత్ బాలీవుడ్ను విస్తరించుకుని ఉన్న పెద్ద పెట్టు డ్రగ్ సిండికేట్లో ఓ పావు అని, చాలా మంది పాత్రధారులు దీనిని నడిపించే వారు వెనుక ఉన్నారని, ఇప్పుడు సాగుతోన్న ఎన్సిబి దర్యాప్తు క్రమంలో వెల్లడైంది. కేసుకు సంబంధించి ఎన్సిబి ఇప్పటికి మొత్తం 16 మంది నిందితులను అరెస్టు చేసింది. వీరిలో నటి రియా చక్రవర్తి, సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరండా ఇతరులు ఉన్నారు.
NCB to Summon bollywood Celebrities