Friday, April 26, 2024

ఎన్నికల విధానంలో మార్పు అవసరం

- Advertisement -
- Advertisement -
 పోలైన ఓట్ల శాతాన్ని బట్టి ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధానం రావాలి
 రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

హైదరాబాద్ : భవిష్యత్ తరాలకు మెరుగైన ఎన్నికల వ్యవస్థను అందించేందుకు భారత ఎన్నికల ప్రక్రియలో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. మునుగోడులో టిఆర్‌ఎస్ విజయం సాధించిన సందర్భంగా టిఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేవలం 32 శాతం ఓట్లు సాధించి బిజెపి తరపున నరేంద్రమోదీ ప్రధాని అయ్యారు. 60 శాతానికి పైగా ప్రజలు బిజెపిని తిరస్కరించినా.. కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కాబట్టి ఎన్నికల ప్రక్రియలో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వినోద్‌కుమార్ అన్నారు. రాజకీయ పార్టీలకు పోలైన ఓట్లను బట్టి ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే స్థితికి భారతదేశం కూడా చేరుకోవాలి. ఈ విషయంలో దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని, మేధావులు ఆలోచించాలని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు, సుందర కట్టడాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి త్వరలో సమీక్షిస్తారని వెల్లడించారు. ‘దక్షిణ కాశీ’గా పేరొందిన వేములవాడ పుణ్యక్షేత్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వినోద్‌కుమార్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణానికి ఎలాంటి విఘాతం కలగకుండా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News