మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్కు రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కొత్త నిర్వచనం ఇచ్చారు. కెసిఆర్ అంటే కె. కాల్వలు, సి… చెరువులు, ఆర్… రిజర్వాయర్లుగా తన పేరును సార్థకం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. శుక్రవారం మేడిగడ్డ నుండి కొండపోచమ్మ వరకు 82 మీటర్ల ఎత్తు నుండి 618 మీటర్ల ఎత్తు వరకు నీటి పంపు చేయడానికి మోటార్ స్విచ్ అన్ చేసిన సిఎం కెసిఆర్కు ఆయన తనయుడు కెటిఆర్ కొత్త నిర్వచనం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే లక్ష్యంగా సిఎం కెసిఆర్ ముందుకెళ్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చి, రైతుల ముఖాల్లో సంతోషం నింపే దిశగా సిఎం కెసిఆర్ అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు.
గోదావరి, కృష్ణా జలాలను ఒడిసిపట్టి.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టులకు సిఎం రూపకల్పన చేశారన్నారు. ఇందులో భాగంగా గోదావరి జలాలను ఒడిసి పట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే కెసిఆర్కు మంత్రి కెటిఆర్ కొత్త నిర్వచనమిచ్చారు. కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతుండటంతో కెసిఆర్ పేరు సార్థకమైందన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసిందని కెటిఆర్ తెలిపారు. ఈ రిజర్వాయర్లు ద్వారా హైదరాబాద్ ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. దూరదృష్టితో భవిష్యత్ తరాలకు ఉపయోగపడేవిధంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న సిఎం కెసిఆర్కు కెటిఆర్ ప్రత్యేకంగా తన ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపారు.
K కాల్వలు
C చెరువులు
R రిజర్వాయర్లు పేరు సార్థకం కాగా…🙏మేడిగడ్డ నుండి కొండపోచమ్మ వరకు…
82 మీటర్ల ఎత్తు నుండి 618 మీటర్ల ఎత్తు వరకు 🙏
World’s largest multi-stage lift irrigation project 💪 completed in 3 years by India’s youngest state #Telangana #KaleshwaramProject pic.twitter.com/IQcoi46xSX
— KTR (@KTRTRS) May 29, 2020