చండీగఢ్: ఇటీవల ప్రవేశ పెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శల దాడిని ఉధృతం చేస్తూ ఇది ప్రతి రైతు ఆత్మపై తీవ్ర దాడిగా ధ్వజమెత్తారు. ఇటువంటి చట్టాలు దేశ పునాదులను బలహీన పరుస్తాయని ఆయన వ్యాఖ్యానిం చారు. ఇటీవల పంజాబ్, హర్యానాల్లో ఈ చట్టాలకు వ్యతిరేకంగా తాను నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలను ప్రస్తావిస్తూ ప్రతిరైతు ఇవి తమ ఆత్మపై దాడిగా ఆందోళన చెందుతున్నారని తాను గమనించినట్టు పేర్కొన్నారు. ఈ కొత్త చట్టాలపై చర్చించడానికి ఈనెల 19న పంజాబ్ ప్రభుత్వ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించడానికి నిర్ణయించడంపై రాహుల్ ఆనందం వెలిబుచ్చారు. పంజాబ్లో రెండోదశ ‘స్మార్ట్ విలేజి క్యాంపైన్’ ప్రారంభం సందర్భంగా ఆయన వర్చువల్ సదస్సు ద్వారా మాట్లాడారు. ఈ క్యాంపైన్ కింద దాదాపు 50 వేల వివిధ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి రూ.2633 కోట్లను కేటాయించినట్టు చెప్పారు. ఈ వర్చువల్ ప్రారంభానికి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కొందరు మంత్రులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి అమరీందర్సింగ్ మాట్లాడుతూ.. కొత్త చట్టాలపై సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చిస్తామని చెప్పారు.
New Farm Laws attack on Farmers Soul: Rahul Gandhi