Thursday, April 25, 2024

సరికొత్త తరగతి గదులు!

- Advertisement -
- Advertisement -
Newest classrooms with Corona

 

చదువులలో నూతన గాలులు

ఇక ముందు తరగతిలో కిక్కిరిసిన విద్యార్థులు ఉండరు. తరగతిలో విద్యార్థుల సంఖ్య సగానికి సగం తగ్గిపోతుంది. పాఠ్యాంశాలు రెట్టింపవుతాయి. విద్యార్థులు ఇంటర్నెట్ పై గడిపే సమయం మూడింతలు పెరుగుతుంది. ఇది విద్యావ్యవస్థ భవిష్యత్తు. కోవిడ్ 19 తర్వాతి కాలంలో ముఖ్యంగా ఉన్నత విద్యారంగం పరిస్థితి ఇలాగే ఉండబోతోంది. ఈ సంవత్సరం రెండో అర్థభాగంలో ఈ భవిష్యత్తు మన ముందుకు రాబోతోంది. విద్యా సంవత్సరం కూడా మూడు నెలలు ఆలస్యంగా ప్రారంభం కాబోతోంది. బహుశా సెప్టెంబరు 2020 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభంకావచ్చు. కాని, విద్యా వ్యవస్థలో చోటుచేసుకునే ఈ మార్పులు ఇక శాశ్వతంగా ఉంటాయి. మన ప్రపంచం అనేక సంక్షోభాలను చూసింది. ఆ సంక్షోభాల మాదిరిగానే ఈ సంక్షోభం కూడా పూడ్చలేని నష్టాలను చేస్తోంది. అయితే దాంతో పాటు మనకు తెలియని అనేక అవకాశాలను కూడా తీసుకు వస్తోంది. ఇక ఇప్పుడు బోధన అనేది పూర్తిగా మారిపోతోంది.

విద్యా బోధన పరికరాలు అనేకానేకం కొత్తగా రాబోతున్నాయి. విద్యార్థులు చదువుకోవడం, విద్యాజ్ఞానాలను సంపాదించడం అనేది పూర్తిగా మారిపోతుంది. భవిష్యత్తులో రానున్న సవాళ్ళను ఎదుర్కొనేలా వారిని సిద్ధం చేసే విద్యావ్యవస్థ ఉనికిలోకి రాబోతుంది. జీవితమా? జీవనోపాధా? ఏది ముఖ్యం అనే చర్చ ఇప్పుడు తీవ్రంగా నడుస్తోంది. దీర్ఘకాలం లాక్‌డౌన్ విధించడాన్ని సమర్థించేవారు, వ్యతిరేకించేవారి మధ్య ఈ చర్చ జరుగుతోంది. కాని ఈ చర్చ వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే, జీవితం, జీవనోపాధి ఈ రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడిఉన్నాయి. జీవనోపాధిలేని జీవితాన్ని ఊహించలేం. అలాగే జీవితంలేని జీవనోపాధి గురించి మాట్లాడడం అసంబద్ధం. అన్ని రంగాల మాదిరిగా విద్యారంగం కూడా ఈ పరిస్థితుల్లో ఆచితూచి అడుగువేయవలసి ఉంది. విద్యా వ్యవస్థ ప్రగతి వికాసాలకు సరైన మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగవలసి ఉంది.

వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్టు డేవిడ్ వాన్ డ్రేహీ చెప్పినట్లు మనం మధ్యే మార్గాన్ని అవలంబించవలసి ఉంది. ఇది మహమ్మారి సమయంలో ఆచరణీయ ధోరణి. జీవితం, జీవనోపాధి ఈ రెండింటి మధ్య సమతుల్యాన్ని, సమతూకాన్ని మనం సాధించవలసి ఉంది. మనకు రెండు అవసరమే. ఇవి ఒకదానికి ఒకటి విరుద్ధమైనవి కాదు. ఒకదానికి ఒకటి పూరకం వంటివి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మిగిలేది నిరర్థకం. కాబట్టి ఈ సమతూకాన్ని పాటించే మధ్యేమార్గంపై అన్నిస్థాయిల్లో విద్యావ్యవస్థను తీర్చిదిద్దవలసి ఉంది. ప్రపంచం రెండు ప్రపంచ యుద్ధాలను చూసింది. ఈ రెండు ప్రపంచ యుద్ధాలు ప్రపంచంలో జీవితాన్ని చాలా మార్చివేశాయి. అలాగే ఈ కోవిద్ 19 వైరస్ కూడా ప్రపంచంలో విద్యా వ్యవస్థను మార్చేసే రిసెట్ బటన్ నొక్కింది. రానున్న మార్పుల్లో అన్నింటికన్నా ముఖ్యమైనది, భౌతికంగా విద్యార్థులు హాజరు కావలసిన తరగతి గదులు తగ్గిపోతున్నాయి. అలాగే టీచర్లు ప్రత్యక్షంగా బోధించడమూ తగ్గిపోతుంది.విద్యాబోధన, విద్యాసంవత్సరాలు ఏ విపత్తు వల్ల కూడా ప్రభావితం కాని కొత్త తరగతి గదులు రాబోతున్నాయి.

యుద్ధాల వల్ల కాని, మహమ్మారి వల్ల కాని ప్రభావితం కాని తరగతి గదులు భవిష్యత్తులో రావడం మొదటి మార్పు. తరగతిగదిలో విద్యార్థులసంఖ్య సగానికి సగం తగ్గిపోతుంది. తరగతి గదిలో 80 నుంచి 120 విద్యార్థులు ఉండే ఆ పరిస్థితిని ఇక మనం మరిచిపోవచ్చు. ఇప్పుడు తరగతి గదిలో 30 నుంచి 40 మంది మాత్రమే ఉంటారు. అది కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ కూర్చుంటారు. అవసరమైతే ప్రతి తరగతి గదిలోను వివిధ బ్యాచులు చేయడం జరుగుతుంది. ప్రత్యామ్నాయ సమయాల్లో వారికి బోధించడం జరుగుతుంది. అంటే బ్యాచ్ ఏ కు మూడు రోజులు బోధిస్తే, బ్యాచ్ బికి మూడు రోజులు బోధిస్తారు. భౌతికంగా క్లాసులో హాజరుకాని రోజుల్లో ఆన్‌లైన్ క్లాసులు నడుస్తుంటాయి. పాఠ్యాంశాలను రెట్టింపు చేయడం జరుగుతుంది. పాఠ్యపుస్తకంలో సిలబస్ మాత్రమే అనుసరించడం జరగదు. గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ ఏ కోర్సులో అయినాగాని అనేక కొత్తమార్పులు వస్తాయి.

పాఠ్యాంశాల్లో కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకుంటాయి. ప్రతి కోర్సులోను కోవిద్ 19 తదనంతర కోణం తప్పక ఉంటుంది. టీచర్లు ఈ మార్పులకు సిద్ధంగా ఉండాలి. విద్యార్థి తన విద్యాభ్యాసానికి వెచ్చించే సమయం మూడింతలు పెరిగిపోతుంది. మొదటి భాగం పాతపద్ధతి విద్యాబోధన. రెండవది కొత్త పరిణామాలు, మూడవది ఆచరణాత్మకంగా ఉపయోగించడం. ఉదాహరణకు వైద్య విద్యార్థులు ఆసుపత్రుల్లో రోగుల పరిశీలనలో ఎక్కువ సమయం గడపవలసి రావచ్చు. లేకపోతే కొత్త సవాళ్ళను ఎదుర్కోడానికి తగిన పరిజ్ఞానం సంపాదించడం వారికి సాధ్యం కాదు. మానవశాస్త్రాలు, కళలకు సంబంధించిన కోర్సులు కూడా ప్రాజెక్టు వర్కులను చేపట్టవలసి వస్తుంది. సమాజంలో ఎలాంటి ప్రభావాలు పడుతున్నాయో పరిశీలించవలసి ఉంటుంది. ఉదాహరణకు కామర్స్ విద్యార్థి లాక్‌డౌన్ కాలంలో ఒక కిరణా దుకాణం ఎలా వ్యాపారం చేసిందో ప్రాజెక్టు వర్కు చేయాలి. ఆర్థికశాస్త్ర విద్యార్థి వలస కూలీలు ఎలా ప్రభుత్వ సహాయంతో ఈ పరిస్థితులు ఎదుర్కొన్నారో ప్రాజెక్టు చేయవలసి ఉండవచ్చు.

విశ్వవిద్యాలయాలు, కాలేజీలు తమ బ్రాడ్ బ్యాండ్, వైఫై కనెక్టివిటి సదుపాయాలు మెరుగుపరచుకోవలసి ఉంటుంది. ఇంటర్నెట్ వేగం పెంచుకోవలసి ఉంటుంది. ఇప్పటికే చాలా కాలేజిల్లో విద్యార్థులు ఇంటర్నెట్, ల్యాప్‌టాప్‌లకు అలవాటుపడ్డారు. ఇప్పుడిక అన్ని స్కూళ్ళు, కాలేజీలు, ప్రతి విద్యార్థి వీటిని వాడక తప్పదు. విద్యారంగంలో డిజిటలైజేషన్ తప్పనిసరి. జూమ్ యాప్ ఇప్పటికే విద్యార్థుల్లో ఆదరణ పొందింది. అలాంటి ఇంకా అనేక యాప్‌లు రావచ్చు. తల్లిదండ్రులు, ఇల్లు కూడా చాలా మార్పులు పొందక తప్పదు. తమ పిల్లలకు కంప్యూటరు, ల్యాప్‌టాప్, ఇంటర్నెట్, వారి చదువుకు కొంత వ్యక్తిగత స్థలం కేటాయించవలసి వస్తుంది. ఇంట ఉండి పని చేయడం అంటే వర్క్ ఫ్రం హోం అనేది అలవాటు అవుతున్నట్లే, స్టడీ ఫ్రం హోం లేదా ఇంట ఉండి విద్యార్జన అనేది కొత్తగా ప్రాబల్యం పొందుతుంది. పెద్ద పెద్ద స్క్రీన్లున్న మొబైల్ ఫోన్లు, నెట్ కనెక్టివిటి వంటివి విద్యాజ్ఞానాలు పొందడానికి, చదువుకోడానికి భవిష్యత్తులో తప్పనిసరి అవుతాయి. ఇప్పటి వరకు విద్యార్థులు మార్కుల కోసం, సర్టిఫికేట్ల కోసం చదివేవారు. అంటే మంచి ఉద్యోగాలు సంపాదించుకోడానికి చదువుకునేవారు.

ఇప్పుడు ప్రత్యేక విషయం గురించి తమజ్ఙానాన్ని పెంచుకోడానికి చదువుకోవాలి. కొత్త ప్రపంచంలో నిర్దిష్ట విషయంలో అవగాహన, పరిజ్ఞానం ఉన్నవారు మాత్రమే నిలబడగలరు. కాబట్టి తరగతి గదిలో బోధన, లైబ్రరీలో పుస్తకాలు, డిజిటల్ పాఠాలు, రియల్ టైమ్ ప్రాజెక్ట్ వర్కులు అన్ని కలిసి విద్యార్థులను తీర్చిదిద్దే కాలం మున్ముందు రాబోతుంది. ఈ సవాళ్ళు రెండు మార్పులను సూచిస్తున్నాయి. ఒకటి సాంకేతికత పాత్ర పెరుగుతుంది. ముఖ్యంగా విద్యారంగంలో టెక్నాలజీ పెరుగుతోంది. రెండవ మార్పు ఏమిటంటే, ప్రతిసబ్జక్టులోను అనేక విషయాల ద్వారా అంటే మల్టీ డిసిప్లినరీ ఆలోచనలతో కొనసాగడం స్థిరపడుతుంది. మొదటి మార్పు చాలా సరళమైనది. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు విద్యార్జనకు ఉపయోగిస్తారు. రెండవది, మల్టీ డిసిప్లినరీ ప్రక్రియ.

అంటే విద్యార్థి ఏ సబ్జక్టు చదువుకున్నాడో దానికి సంబంధించిన ఇతర సబ్జక్టుల పరిజ్ఙానం కలిగి ఉండాలి. దీనికి అనుగుణంగానే పరీక్షల పద్ధతులు కూడా మారిపోతాయి. ప్రశ్నాపత్రాలు చిన్నవైపోతాయి. టెస్టుల సమయం తగ్గిపోతుంది. సెమిస్టర్ల విషయంలో సడలింపులు ఉంటాయి. రియల్ టైం ప్రాజెక్టులు పెరుగుతాయి. కేవలం ప్రశ్నాపత్రానికి ఇచ్చిన జవాబుల ఆధారంగా ఇప్పటి వరకు గ్రేడింగులు ఇచ్చేవారు. ముందు ముందు గ్రేడింగులు ఇవ్వడం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. అన్నింటికి మించి టీచర్లకు ఈ మార్పుల గురించి అవగాహన కల్పించే ఉపాధ్యాయ బోధన అనేది ఇప్పుడు చాలా అవసరం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News