Thursday, April 25, 2024

అందుబాటులో విత్తనాలు

- Advertisement -
- Advertisement -

వానాకాలం పంటల సాగుకు 18లక్షల క్వింటాళ్ల విత్తనాలు
నకిలీల ఏరివేతకు టాస్క్‌పోర్స్ బృందాలు
కల్తీ విత్తానాలు విక్రయిస్తే కఠిన చర్యలు
మంత్రి నిరంజన్డ్డ్రి హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుకు అవరసరమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. అన్ని రకాల విత్తనాలు సుమారు 18లక్షల క్వింటాళ్లు అవసరం అని అంచనా వేసినట్టు తెలిపారు. వానాకాలం సాగుకు అందుబాటులో విత్తనాలు, విత్తన నియంత్రణ, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం సమావేశ మందిరంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వానాకాల పంటల సాగుకు అవసరమైన వరి , పత్తి, మిరప కంది తదితర పంటలకు సబంధించిన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు.

9 ఏళ్లలో వ్యవసాయరంగంపై తెలంగాణ ప్రభుత్వం అక్షరాల రూ.4.50లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఒక రంగం మీద ఇంత భారీగా ఏ ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. తెలంగాణలో వ్యవసాయానికే తొలిప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి మూలంగా దేశంలో తెలంగాణ వ్యవసాయ రంగానికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. వ్యవసాయ రంగం బలోపేతం ద్వారానే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి అన్నది కేసీఅర్ ఆలోచనగా పేర్కొన్నారు. వ్యవసాయ రంగం నుండి లభించే విస్తృతమైన ఉపాధి మరే రంగం కూడా ఇవ్వలేదన్నారు. ఆ ప్రాధాన్యతను గుర్తించే తెలంగాణ ప్రభుత్వం గత 9 ఏళ్లలో ఉచిత కరంటు, పంటల కొనుగోళ్లు, రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, విత్తనాలు, ఎరువుల సబ్సిడీ, వ్యవసాయ యాంత్రీకరణ, పంటల మార్పిడి వంటి వాటికి తెలంగాణ ప్రభుత్వం రూ.4.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. దేశంలో మనకన్నా విస్తీర్ణంలో, జనాభాపరంగా పెద్దవైన రాష్ట్రాలు ఏవీ ఇంత ఖర్చు పెట్టలేదన్నారు.

తెలంగాణ ప్రభుత్వ 9 ఏళ్ల కృషికి క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. పల్లెసీమలు బాగుపడ్డాయని, ప్రజల చేతికి పని వచ్చిందన్నారు. వ్వవసాయ ఉత్పత్తులు, ఉత్పాదకత పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయిందని వెల్లడించారు. భిన్న వృత్తులు, ఉపాధులు బలపడి సమగ్రమైన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నదని, అన్నింటికీ వ్యవసాయమే మూలాధారంగా నిలిచిందన్నారు.వ్యవసాయం బాగుండాలంటే రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికతో వ్యవహరిస్తున్నామని తెలిపారు. ఈ వానాకాలానికి పత్తి, మిరప, కందులు, వరి మిగిలిన అన్ని రకాలు కలిపి 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనా వేసామని తెలిపారు. పోటీ ప్రపంచంలో విత్తనాల తయారీలో ప్రైవేటు కంపెనీలదే పైచేయిగా ఉందని, వాటిని నియంత్రించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందన్నారు.

నకిలీ విత్తనాలపట్ల కఠిన వైఖరి:
నకిలీ విత్తనాలు సరఫరా చేసే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. గతంతో పోలిస్తే నకిలీ విత్తనాలు దాదాపు కనుమరుగయ్యాయన్నారు. ఈ విషయంలో టాస్క్ ఫోర్స్, వ్యవసాయ శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలను అరికట్టే ప్రయత్నంలో అమాయకులను బలిచేయవద్దని, ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కర్ణాటక, కర్నూలు, గద్వాల వైపు నుండి, గుంటూరు, ప్రకాశం వైపు నుండి, అసిఫాబాద్, బెల్లంపల్లి వైపు నుండి, గుజరాత్ వైపు నుండి జహీరాబాద్ మీదుగా వచ్చే దారులపై నిఘా ఉంచాలని అధికారుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రధానంగా గుజరాత్, ఆంధ్రా ప్రాంతాల నుండి నకిలీ విత్తనాల బెడద ఉన్నదని , గత కొన్నేళ్లుగా ఈ విషయం రుజువవుతోందన్నారు. హెచ్ టీ పత్తి విత్తనాల విషయంలో రైతులను చైతన్యం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో కనిపించే చిన్న, చిన్న లోపాలు, తప్పిదాలపై కఠినంగా వ్యవహరించకుండా ట్రేడర్లు, విత్తన వ్యాపారులకు సమయం ఇచ్చి సరిచేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

దేశంలో అవసరమైన 60 శాతం విత్తనాలను తెలంగాణ రాష్ట్రమే అందిస్తున్నదని, ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలన్నారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితోపాటు ఈ సమావేశంలో డీజీపీ అంజనీ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్, సీఐడీ చీఫ్ మహేష్ భగవత్, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, డీఐజీ షానవాజ్ ఖాసీం, డీఐజీ ఇంటలిజెన్స్ కార్తికేయ, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంత్, ఉద్యాన శాఖ డైరెక్టర్ హన్మంతరావు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండి కేశవులు, అడిషనల్ డిఎ విజయ్ కుమార్, రిజిస్ట్రార్లు సుధీర్ కుమార్, భగవాన్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డిఎఓలు, అన్ని స్థాయిల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News