లండన్: భారత్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్కు వేలాది కోట్ల రూపాయలు మోసం చేసి బ్రిటన్లో తలదాడుకున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్కు అప్పగించే పత్రాలపై బ్రిటీష్ హోంమంత్రి ప్రీతి పటేల్ గత నెల సంతకాలు చేసిన విషయం తెలిసిందే. అయితే తనను భారత్కు అప్పగించాల్సిందిగా లండన్లోని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అపీలు చేసుకోవడానికి అనుమతి కోరుతూ నీరవ్ మోడీ ఒక దరఖాస్తు దాఖలు చేసుకున్నారు. దరఖాస్తు దాఖలు చేసుకున్న విషయాన్ని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సిపిఎస్) ధ్రువీకరించింది. అయితే ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకునే హైకోర్టు జడ్జి ఎవరో ఇంకా నిర్ణయించలేదని తెలిపింది. ‘దీనిపై నిర్ణయం తీసుకునే జడ్జికి ఈ వ్యవహారాన్ని ఇంకా పంపించలేదు’ అని లండన్లోని రాయల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కు చెందిన పరిపాలనా విభాగం తెలియజేసింది.
ముందుగా అపీల్ కోసం దాఖలు చేసిన పత్రాలను హైకోర్టు జడ్జి పరిశీలించి హోంమంత్రి నిర్ణయం లేదా గత ఫిబ్రవరిలో నీరవ్ మోడీని భారత్కు అప్పగించాలంటూ ఆదేశించిన వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా అపీలు చేయడానికి తగిన కారణాలు ఉన్నాయా అనే విషయాన్ని నిర్ణయిస్తారు. ఆ తర్వాత డిఫెన్స్ న్యాయవాదుల బృందం తమ కేసు ఓరల్ హియరింగ్ను కోరే అవకాశం ఉంటుంది. అయితే ఈ న్యాయప్రక్రియ అంతా పూర్తి కావడానికి నిర్ణీత కాలపరిమితి అంటూ ఏమీ లేదు. ఇదంతా పూర్తి కావడానికి నెలలు కూడా పట్టవచ్చు. అపీలుకు అనుమతి కోరుతూ డిఫెన్స్ న్యాయవాదులు దరఖాస్తు దాఖలు చేస్తారో లేదో వేచి చూస్తున్నామని, ఆ తర్వాత భారత ప్రభుత్వం తరఫున తాము దాన్ని సవాలు చేస్తామని సిపిఎస్ ప్రతినిధి ఒకరు ఇంతకు ముందు చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 2019 మార్చి19న అరెస్టు చేసినప్టపినుంచి గత రెండేళ్లుగా నీరవ్ మోడీ లండన్లోని వాండ్స్వర్త్ జైల్లోనే ఉన్నారు.
Nirav Modi petition against his extradition to India