న్యూఢిల్లీ: తాము తిరిగి అధికారంలోకి వస్తే బీహార్ ప్రజలకు ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్ను అందచేస్తామంటూ బిజెపి చేసిన ఎన్నికల వాగ్దానంపై ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తిప్పికొట్టారు. తాము చేసిన ప్రకటన విస్పష్టంగా ఉందని, అధికారంలోకి వస్తే తాము ఏమి చేయదలచుకున్నామో ప్రకటించే హక్కు ఏ పారీకైనా ఉంటుందని ఆమె చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బిజెపి మేనిఫెస్టోను నిర్మలా సీతారామన్ గురువారం విడుదల చేయగా తాము తిరిగి అధికారంలోకి వస్తే బీహార్ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందచేస్తామని చేసిన వాగ్దానంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కరోనా మహమ్మారిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్న బిజెపిపై చర్యలుతీసుకోవాలని వారు ఎన్నికల కమిషన్ను కోరారు.
ఈ నేపథ్యంలో సీతారామన్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ అది మేనిఫెస్టో ప్రకటనని, తాను అధికారంలోకి వస్తే ఏమి చేయాలనుకుంటున్నదో ఏ రాజకీయ పార్టీ అయినా చెప్పుకోవచ్చని అన్నారు. వైద్య ఆరోగ్యం అన్నవి రాష్టానికి సంబంధించిన అంశాలని, తాము చేసిన ప్రకటన విస్పష్టంగా, నిబంధనలకు లోబడి ఉందని ఆమె చెప్పారు. అక్టోబర్ 28 నుంచి మూడు దశలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Nirmala Sitharaman on free corona vaccine for Bihar