న్యూఢిల్లీ: దేవుని అవతారంగా చెప్పుకున్న నిత్యానంద తన దేశంలో మూడు రోజుల పర్యటనకు వీసాలు జారీ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈక్వెడార్ పక్కన దీవుల్ని కొనుగోలు చేసి కైలాస పేరుతో స్వతంత్ర హిందూ రాజ్యాన్ని స్థాపించానని నిత్యానంద ఏడాది క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. తన పేరున ఉన్న ఫేస్బుక్ ఖాతాలో మరో వీడియోను తాజాగా పోస్ట్ చేశాడు. ఆస్ట్రేలియా నుంచి గరుడ పేరుతో విమాన సర్వీసుల్ని తన దేశం నిర్వహిస్తోందని తెలిపాడు. ఆస్ట్రేలియా వరకు సొంత ఖర్చులతో రావాలని, ఆ తర్వాత విమానంలో ఫ్రీగా తీసుకువెళ్తామని, మూడు రోజులపాటు భోజన, వసతి సదుపాయాలు కూడా ఉచితమేనని ఆ వీడియోలో ప్రకటించాడు. తమ దేశంలో మూడు రోజుల పర్యటనకే పరిమితి విధించామని, పరమశివుణ్ని ఒక్కసారి దర్శించేందుకు మాత్రమే అనుమతిస్తామని తెలిపాడు. కర్నాటకలోని తన ఆశ్రమంలో యువతులపై అత్యాచారానికి పాల్పడినట్టు నిత్యానందపై ఆరోపణలున్నాయి. ఆ కేసులో విచారణ జరుగుతున్న సమయంలో బెయిల్పై విడుదలైన నిత్యానంద దేశం విడిచి పారిపోయాడు.