Saturday, April 20, 2024

రాహుల్, ఖర్గేలతో నితీష్ కుమార్ భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 2024 సాధారణ ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమిని పటిష్టం చేయాలన్న లక్షంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరుసగా విపక్ష నేతలను కలుసుకుని చర్చిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సోమవారం నితీష్ కలుసుకుని చర్చలు జరిపారు. ఢిల్లీ 10, రాజాజీ మార్గ్ లోని నివాసంలో ఈ భేటీ జరిగింది. విపక్షాల కూటమిని మరింత బలోపేతం చేయడానికి కావలసిన రోడ్ మ్యాప్‌పై ఈ చర్చలు జరిగినట్టు ఆయా వర్గాలు తెలిపాయి.

గత ఒకటిన్నర నెలల్లో ఈ విధంగా వీరితో భేటీ కావడం రెండోసారి. ఈమేరకు త్వరలో పాట్నాలో జరగనున్న సమావేశంలో దీనిపై మరింత సమగ్రంగా చర్చిస్తారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, జెడి(యు) చీఫ్ లాలన్ సింగ్, కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం నాడు నితీష్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలుసుకుని విపక్షాల ఐక్యతపై చర్చించిన తరువాత మరునాడే రాహుల్, ఖర్గేలతో ఈ సమావేశం జరగడం ప్రాముఖ్యత సంతరించుకుంది. కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలుసుకున్న నితీష్ కేంద్రంతో ఢిల్లీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సంక్షోభంపై కేజ్రీవాల్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు.

శనివారం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి నితీష్ కుమార్‌తోపాటు తేజస్వియాదవ్, ఝార్ఖండ్ సిఎం హేమంత్ సొరేన్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శరద్ పవార్, తమిళనాడు సిఎం స్టాలిన్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా హాజరు కావడం విపక్షాల ఐక్యతకు సంకేతాలను అందించింది. విపక్షాల ఐక్యత కోసం సాగించే కసరత్తులో విపక్షాల నేతలను, ప్రాంతీయ పార్టీల ప్రముఖులను తరచుగా నితీష్ కలుసుకొంటుండడం ఇంకా ఒక నిర్మాణాత్మక స్వరూపాన్ని సంతరించుకోవలసి ఉంది. గత నెల నితీష్ కుమార్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత విపక్షాల ఐక్యతపై సుదీర్ఘంగా చర్చించడానికి పాట్నాలో సమావేశం జరగనున్నదని నితీష్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News