Thursday, March 28, 2024

మూడో కూటమి కాదు.. మెయిన్ ఫ్రంట్ కావాలి

- Advertisement -
- Advertisement -

Nitish Kumar Speech at INLD Rally in Haryana

మూడో కూటమి కాదు.. మెయిన్ ఫ్రంట్ కావాలి
కాంగ్రెస్, లెఫ్ట్ లేని కూటమిని ఊహించుకోలేం
ఈ దిశగా అందరూ కృషి చేయాలి
ఐఎన్‌ఎల్‌డి ర్యాలీలో బీహార్ సిఎం నితీశ్ కుమార్ పిలుపు
ఢిల్లీలో ప్రభుత్వాన్ని మార్చే రోజు వచ్చింది: శరద్ పవార్
బిజెపి పెద్ద జూటా పార్టీ: తేజస్వి యాదవ్
ఫతేబాద్: బిజెపిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, వామపక్షాలు సహా ప్రతిపక్షాలన్నీ ఒక్క తాటిపైకి రావాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. అలా ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక్క కూటమిగా ఏర్పడితే అది 2024 ఎన్నికల్లో బిజెపిని చిత్తుగా ఓడించగలుగుతుందని ఆయన అన్నారు. బిజెపియేతర పార్టీలన్నీ ఒక్కటయితే దేశాన్ని నాశనం చేయడానికి కృషి చేస్తున్న వారిని తరిమి కొట్టగలుగుతాయని మాజీ ప్రధాని దేవీలాల్ 108వ జయంతి సందర్భంగా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్( ఐఎన్‌ఎల్‌డి) ఆదివారం హర్యానాలోని ఫతేపూర్‌లో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో మాట్లాడుతూ నితీశ్ అన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు బిజెపి హిందేముస్లిం విభేదాలను సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. సమాజంలో హిందువులు, ముస్లింల మధ్య నిజంగా ఘర్షణ లేదని ఆయన అంటూ అయితే అన్ని చోట్లా కొంత మంది తప్పుడు పనులు చేసే వారు ఉంటారన్నారు.1947లో దేశ విభజన సమయంలో ముస్లింలలో అధిక సంఖ్యాకులు భారత్‌లోనే ఉండడానికి ఇష్టపడ్డారని నితీశ్ గుర్తు చేశారు. కాంగ్రెస్, వామపక్షాలు లేకుండా ప్రతిపక్షాల కూటమి ని ఊహించుకోలేమని నితీశ్ అంటూ, విస్తృతమైన కూటమి ఏర్పాటు దిశగా కృషి చేయాలని వేదికపై ఉన్న ప్రతిపక్ష నేతలను కోరారు.

కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ఐఎన్‌ఎల్‌డి నేత ఓం ప్రకాశ్ చౌతాలా, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌తో పాటుగా ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేనకు చెందిన అరవింద్ సావంత్ లాంటి సీనియర్ నేతలు కూడా వేదికపై ఉన్నారు. బిజెపియేతర పార్టీల మధ్య ఐక్యత దిశగా ముందడుగుగా భావిస్తున్న ఈ ర్యాలీలో బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్ కూడా వేదికపై ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీనుంచి ఎవరు కూడ ఈ ర్యాలీకి హాజరు కాకపోవడం గమనార్హం. ఇప్పుడు కావలసింది మూడో ఫ్రంట్ కాదని, ప్రటతిపక్షాలన్నీ కలిసిన ప్రధాన కూటమి అని నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. అప్పుడు మాత్రమే ప్రతిపక్షాలు సునాయాసంగా విజయం సాధించగలుగుతాయని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు లేకుండా మిగతా ప్రతిపక్షాలు థర్డ్‌ఫ్రంట్‌గా ఏర్పడాలని కొందరు ప్రయత్నిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ నితీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ర్యాలీ అనంతరం నితీశ్ విలేఖరులతో మాట్లాడుతూ, తాను ప్రధానమంత్రి పదవికి పోటీదారును కాదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంలో వాస్తవానికి ఏ పనీ జరగడం లేదని, ఏకపక్ష వాదనను వినిపించడం కోసం మీడియా సహా వివిధ వ్యవస్థలపై తన ఆదిపత్యాన్ని అది బలవంతంగా రుద్దుతోందని దుయ్యబట్టారు. బీహార్‌లో ఏడు పార్టీలు కలిసి ఉండగా, బిజెపి ఒంటరిగా ఉందని ఆయన అంటూ, రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో బిజోపి విజయం సాధించబోదని అన్నారు.
ప్రభుత్వాన్ని మార్చే సమయం వచ్చింది

కాగా ర్యాలీలో ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్ మాట్లాడుతూ, 2024లో కేంద్రంలో ప్రభుత్వ మార్పిడి జరిగేలా చూడడం కోసం ప్రతిఒక్కరూ పని చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనను పవార్ ప్రస్తావిస్తూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం సమస్యకు పరిష్కారం కాదని, ప్రభుత్వాన్ని మార్చడమొక్కటే అసలైన పరిష్కారమని అన్నారు. రైతులు దేశ రాజధాని సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిపారని, అయితే దీర్ఘకాలం ప్రభుత్వం వారి డిమాండ్లకు తలొగ్గలేదని ఆయన అన్నారు. రైతులు, యువకులు ఆత్మహత్యలకు పాల్పడడం పరిష్కారం కాదని, 2024లో కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చడమొక్కటే అసలైన పరిష్కారమని సవార్ అన్నారు.
ఎన్‌డిఎ ఎక్కడుంది: తేజస్వి యాదవ్
కాగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే జెడి(యు), శిరోమణి అకాలీదళ్, శివపేనలు బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎనుంచి బయటికి వచ్చాయని ఆర్‌జెడి నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అన్నారు. బిజెపి తప్పుడు ప్రచారాలు, హామీలుచేస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపిస్తూ ఆ పార్టీ ఒక ‘బట్కా జూటా పార్టీ’ అని అన్నారు. బీహార్‌లోని పూర్ణియాలో విమానాశ్రయం లేనప్పటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల అక్కడ విమానాశ్రయం గురించి మాట్లాడారని అన్నారు. వేదికపై ఉన్న జెడి(యు) నేత నితీశ్ కుమార్, ఎస్‌ఎడి నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్, శివసేన ఎంపి అరవింద్ సావంత్‌లనుద్దేశించి మాట్లాడుతూ, ఒకప్పుడు వీళ్లంతా బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో భాగస్వాములేనని, అయితే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం వాళ్లంతా కూటమినుంచి బైటికి వచ్చారన్నారు. ఇప్పుడు ఎన్‌డిఎ ఎక్కడుందని ప్రశ్నించారు.

Nitish Kumar Speech at INLD Rally in Haryana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News