కెప్టెన్గా బాబర్ ఆజమ్కు అవకాశం
దుబాయి: టి 20 ప్రపంచకప్ 2021లో ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో విజయం సాధించి ఆస్ట్రేలియా తొలి సారిగా ప్రపంచకప్ను ముదాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐసిసి 11 మంది ఆటగాళ్లతో కూడిన టి20 ప్రపంచకప్ 2021 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. ఈ జట్టులో ఆరు దేశాలకు చెందిన జట్ల ఆటగాళ్లకు స్థానం లభించింది. అదే విధంగా టీమిండియాకు చెందిన ఒక్క ఆటగాడికి కూడా ఈ జట్టులో చోటు లభించలేదు. చాంపియన్స్ ఆస్ట్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్ , సెమీఫైనలిస్టులు పాకిస్థాన్, ఇంగ్లండ్, అదేవిధంగా శ్రీలంక, దక్షిణాఫ్రికాకు ఆటగాళ్లను ఎంపిక చేశారు. పాకిస్థాన్కు చెందిన బాబర్ ఆజమ్ను ఈ జట్టుకు కెప్టెన్గా సెలెక్షన్ ప్యానెల్ ఎంపిక చేసింది.ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాట్స్మన్ జోస్ బట్లర్లకు ఓపెనర్లుగా స్థానం లభించింది.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు మూడో స్థానంలో, శ్రీలంకకు చెందిన అసలంకకునాలుగో స్థానంలో చోటు కల్పించారు. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్రమ్ అయిదో స్థానంలో చోటు దక్కించుకున్నాడు. ఆల్రౌండర్ కోటాలో ఇంగ్లండ్కు చెందిన మోయిన్ అలీ, శ్రీలంక ఆటగాడు హసరంగకు స్థానం లభించింది. జట్టులో ఏకైక స్పిన్నర్గా ఆస్ట్రేలియా బౌలర్ ఆదమ్ జంపాను ఎంపిక చేశారు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో జోష్ హేజిల్వుడ్, ట్రెంట్ బౌల్ట్, అన్రిచ్ నోర్జేకు చోటు దక్కింది. ఇక 12వ ఆటగాడియా పాకిస్థాన్ ఫాస్ట్బౌలర్ షాహీన్ అఫ్రిదీని తీసుకుంది. కాగా ఈ జట్టును బిషప్ (కన్వీనర్), నటాలీ జర్మనోస్,షేన్ వాట్సన్, లారెన్స్లతో కూడిన సెలెక్షన్ ప్యానెల్ ఎంపిక చేసింది.
ఐసిసి టి20 ప్రపంచకప్ 2021 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), జోస్బట్లర్( ఇంగ్లండ్ వికెట్కీపర్), బాబర్ ఆజమ్ (పాకిస్థాన్, కెప్టెన్),అసలంక(శ్రీలంక), మార్క్రమ్( దక్షిణాఫ్రికా), మోయిన్ అలీ( ఇంగ్లండ్), హసరంగ(శ్రీలంక), ఆదమ్ జంపా (ఆస్ట్రేలియా), హేజిల్వుడ్( ఆస్ట్రేలియా), ట్రెంట్బౌల్ట్ (న్యూజిలాండ్), అన్రిచ్ నోర్జే(దక్షిణాఫ్రికా).