శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఇప్పుడు ఎవరూ అడ్డుకోలేరని, అభివృద్ధి నుంచి ప్రజలను పక్కదారి పట్టించే సమయం అంతం కావచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్షా స్పష్టం చేశారు. ఆదివారం జమ్ము లోని భగవత్ నగర్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జమ్ముకశ్మీర్కు ప్రత్యేకహోదా రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత అమిత్షా తొలిసారి జమ్ముకశ్మీర్లో మూడు రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంతాభివృద్ధికి ఇప్పటికే రూ. 10,000 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని, 2022 నాటికి రూ. 51,000 కోట్ల విలువైన పెట్టుబడులు, సుమారు 5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని అమిత్షా చెప్పారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధిలో యువత పాలుపంచుకున్నట్టయితే ఉగ్రవాదుల పన్నాగాలు విఫలమవుతాయని ఆయన సూచించారు. ప్రజలెవరూ ఉగ్రవాదానికి బలికాకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని, జమ్ముకశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని ప్రభుత్వం నిర్మూలిస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు అమిత్షా జమ్ము లోని ఐఐటి (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ) నూతన క్యాంపస్ను ఆవిష్కరించారు.