యాంకర్ అనసూయ ఆధ్వర్యంలో గర్భిణీలకు న్యూట్రిషియన్ కిట్ల పంపిణీ
మన తెలంగాణ/కీసర: కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులకు గురవుతున్న పేదలను ఆదుకునేందుకు మానవత్వంతో ముందుకు రావాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. శుక్రవారం కీసరలో ప్రముఖ టివి యాంకర్ అనసూయ భరద్వాజ్ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషియన్ (పోషకాహారం) కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మహేష్ భగవత్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా తగిన పౌష్టికాహారం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గర్భిణీలకు మానవత్వంతో పోషకాహారం కిట్లను అందజేయడం అభినందనీయమని అన్నారు.
రాచకొండ పోలీసు ఆధ్వర్యంలో దాతల సహకారంతో గర్భిణీ స్త్రీలకు పోషకాహార వస్తు సామాగ్రిని అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలోని జవహర్నగర్, మల్కాజిగిరి, యాచారం ప్రాంతాలలో గర్భిణీలకు పౌష్టికాహార కిట్లను అందజేశామన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గర్భిణీలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని అన్నారు. అత్యవసర సమయాల్లో కోవిడ్ కంట్రోల్ రూం నంబరు 9490617234 ద్వారా పోలీసుల సేవలను పొందాలని సూచించారు.
ఇలాంటి సందర్భాల్లో మహీంద్రా అలైట్, శ్రీనివాస ట్రావెల్స్ సహకారంతో అందజేస్తున్న సేవలను గర్భిణీ స్త్రీలు ఉపయోగించుకోవాలని అన్నారు. యాంకర్ అనసూయ బరద్వాజ్ మాట్లాడుతూ తన పుట్టిన రోజున గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషియన్ కిట్లను అందజేసి, వారి ఆశీస్సులు పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మల్కాజిగిరి డిసిపి రక్షిత మూర్తి, అడిషనల్ డిసిపి శిల్పవల్లి, కుషాయిగూడ ఎసిపి శివకుమార్, కీసర సిఐ నరేందర్ గౌడ్, మండల వైద్యాధికారి డా.సరిత, జీవన్ వాలంటీర్ డా.అవినాష్ తదితరులు పాల్గొన్నారు.