న్యూఢిల్లీ: ధన్బాద్ జడ్జి హత్య కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ వ్యాప్తంగా జడ్జిలు, న్యాయవాదులకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఎటువంటి రక్షణ తీసుకుంటున్నారో దానికి సంబంధించిన అఫిడవిట్లు దాఖలు చేయాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేయగా, మరి కొన్ని దాఖలు చేయలేదు. దీనిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయని రాష్ట్రాలపై లక్ష జరిమానా విధిస్తామని, చీఫ్ సెక్రటరీలు కోర్టుకు స్వయంగా హాజరు కావాలని ఆదేశించ వచ్చని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఎపి, తెలంగాణ, జార్ఖండ్, మిజోరాం, మణిపూర్, రాష్ట్రాలు అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంపై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రాలు అఫిడవిట్ల దాఖలుకు వారం రోజుల సమయం ఇస్తున్నామని అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా వారం లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సిజెఐ ఆదేశించారు.
NV Ramana Key Comments On Judge Murder case