కొత్తూర్: రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలంలో ఓ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. తిమ్మాపూర్లోని నేషనల్ హైవే 44కు సమీపంలో హరి ప్రోటిన్ ఫీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమ నుండి గత కొన్ని రోజులుగా దుర్వాసన వస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు సోమవారం ఆ పరిశ్రమకు వెళ్లారు. అక్కడ జంతువుల కళేబరాలతో కల్తీ నూనె తయారు చేస్తున్న ముఠా బండారం బయట పెట్టారు. దీనితో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్థానికులు పోలిసులకు సమాచారం అందించారు. పరిశ్రమకు చేరుకున్న పోలిసులు కల్తీ నూనెను తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు.
పరిశ్రమలో పోలిసులు తనిఖీలు చేపట్టారు. పరిశ్రమలో జంతు కళేబరాలతో పాటు, చనిపోయిన పందుల కళేబరాలు, కుక్కల కళేబరాలతో కల్తీ నూనె తయారు చేస్తున్నారని పోలిసులు గుర్తించారు. అనంతరం తహశీల్దార్ వెంకట్ రెడ్డి, ఎంపిడిఓ జ్యోతి పరిశ్రమను సీజ్ చేశారు. విఆర్ఓ రామచంద్రయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పరిశ్రమలో పనిచేస్తున్న 7 మంది లేబర్ను అందుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
గతంలో ఆ ప్రదేశంలో కెడియా నూనె పరిశ్రమ ఉండేది. మూడు నెలల కిందట దాన తయారు చేస్తామని తెలిపి ఈ కల్తీ నూనెను తయారు చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలోనే డీసీయంలో జంతు కళేబరాలను తీసుకువచ్చి కల్తీ నూనెను తయారు చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న అక్రమ వ్యాపారులు దొంగచాటుగా కల్తీ నూనెను తయారు చేసి మార్కెట్లో సొమ్ము చేసుకుంటున్నారు.