టోక్యో : జపాన్ వేదికగా వచ్చే ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయా దేశాలకు చెందిన ఒలింపిక్స్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. క్రీడల నిర్వహణకు సంబంధించి జపాన్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయక పోవడంపై ఆయా సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. కరోనా వల్ల ఇప్పటికే ఏడాది పాటు వాయిదా పడిన జపాన్ ఒలింపిక్స్ క్రీడలు వచ్చే ఏడాది అయినా జరుగుతాయా లేదా అనే దానిపై ఇంకా అనిశ్చితి తొలగడం లేదు. దీంతో పలు దేశాలకు చెందిన క్రీడాకారుల్లో ఆందోళన నెలకొంది. ప్రతిష్టాత్మకమైన ఈ క్రీడల నిర్వహణ అంశంలో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం కానీ, నిర్వాహక జపాన్ ప్రభుత్వ కానీ స్పష్టమైన హామీ ఇవ్వలేక పోతోంది. దీంతో ఒలింపిక్స్ కోసం ఏళ్ల తరపడి కఠోర సాధన చేస్తున్న క్రీడాకారులకు ఇది మింగుడు పడని అంశంగా మారింది. కాగా, కరోనా వైరస్కు వ్యాక్సిన్ అందుబాటులో వస్తేనే ఒలింపిక్స్ను నిర్వహిస్తామని జపాన్ స్పష్టం చేసింది. ఈ ప్రకటనపై పెద్ద దుమారమే లేచింది. క్రీడలను నిర్వహించే దేశం ఇలాంటి అస్పష్ట ప్రకటనలు చేయడంపై పలు దేశాలకు చెందిన ఒలింపిక్స్ సంఘాలు మండి పడి న విషయం తెలిసిందే.
క్రీడల నిర్వహణ కు ఏడాది సమయం మిగిలివున్నా కూడా నిర్వాహణ కమిటీకానీ, జపాన్ ప్రభుత్వంకానీ స్పష్టతతో లేక పోవడం ఆయా దేశా ల క్రీడాకారుల్లో ఆందోళన కలిగిస్తోంది. కరోనా మహమ్మరి పూర్తిగా తగ్గే వరకు ఈ క్రీడలు నిర్వహించడం కష్టమని జపాన్ ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే మరోసారి వాయిదా వేయడం కంటే పూర్తిగా క్రీడలనే రద్దు చేస్తామని నిర్వాహణ కమి టీ చైర్మన్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం మాత్రం ఈ ప్రకటనను ఖండించింది. కరోనాకు వ్యాక్సిన్ లభిస్తుందా లేదా అనే అంశంతో ఒలింపిక్స్కు సంబంధం లేదని తేల్చి చెప్పింది. క్రీడల నిర్వహణకు చాలా సమయం ఉన్నందునా అప్పటి వరకు పరిస్థితులు మాములుగా మారడం ఖాయమని పేర్కొంది. ఇక, నిర్వాహణ కమిటీ అనవసర ప్రకటనలు చేసే బదులు పోటీలను విజయవంతంగా నిర్వహించడంపై దృష్టి సారిస్తే మంచిదని సూచించింది. మరోవైపు క్రీడ లు జరుగుతాయా లేదా అనే విషయాన్ని పక్కన బెడితే క్రీడాకారులు మాత్రం తమ ప్రాక్టీస్ను వీడడం లేదు. ఒలింపిక్స్లో ఎలాగైన పతకాలు సాధించాలనే పట్టుదలతో కఠోర సాధన చేస్తున్నారు. ఇక ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా తమ తమ క్రీడాకారులకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఒక్కో అథ్లెట్పై లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే టోక్యోలో ఒలింపిక్స్కు సంబంధించి అన్ని క్రీడా ప్రాంగణాలు సర్వం సిద్ధమయ్యాయి. వీటి నిర్వహణ కూడా జపాన్ ప్రభుత్వానికి భారంగా మారింది. ఇలాంటి స్థితిలో ఒక వేళ క్రీడలు రద్దయితే మాత్రం జపాన్ భారీ మొత్తంలో నష్టాన్ని చవి చూడడం ఖాయం.
Olympic Association demands to give clarity on Olympic 2020