మన తెలంగాణ/రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఒడ్డెలింగాపూర్ గ్రామశివారులో ఓ గీత కార్మికుడు బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… తాట్లవాయి గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాస్(40) కుటుంబం తన పిల్లల చదువు కోసం రాయికల్ మండలకేంద్రంలో ఇంటిని కిరాయికి తీసుకొని ఉంటున్నారు. గీత వృత్తి చేసుకునే శ్రీనివాస్ ప్రతి రోజు ఉదయం తాట్లవాయి గ్రామానికి వెళ్లి గీత వృత్తి చేసుకొని రాత్రి వేళలో ఇంటికి చేరుకునేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తాట్లవాయికి వెళ్లిన శ్రీనివాస్ గీతవృత్తి ముగించుకొని రాత్రి వేళలో తన మోటర్ సైకిల్ నెంబర్ (ఎపి15ఎఎఫ్8605)పై అతి వేగంగా రాయికల్ వస్తుండగా ఒడ్డెలింగాపూర్ గ్రామశివారులో తాను ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న పొలంలో పడిపోగా తీవ్ర గాయాలకు గురై సంఘటన స్థలంలోనే అతడు మృతి చెందాడు. తాను ప్రయాణిస్తున్న వాహనం శ్రీనివాస్ పైనే పడి ఉండటం, ఈ రోడ్డు వెంట ఎవరూ రాకపోవడంతో రోడ్డు ప్రమాదం విషయం గురువారం ఉదయం వరకు తెలియరాలేదని ఎస్ఐ చెప్పారు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శ్రీనివాస్ మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. శ్రీనివాస్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.