Wednesday, April 17, 2024

హుస్సేన్ సాగర్‌లో మట్టివిగ్రహాలే

- Advertisement -
- Advertisement -

only clay idol Immersion in Hussain Sagar

నిమజ్జనానికి చురుగ్గా ఏర్పాట్లు
పిఒపి విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేక కొలనులు

హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వినాయకుల నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న సామూహిక నిమజ్జనం నిర్వహించనున్నారు. శుక్రవారం మూడో రోజు నుంచి గణేషు నిమజ్జనం వేగం పుంజుకోవడంతో ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్ల చేస్తున్నారు. ఇందులో భాగంగా హుస్సేన్ సాగర్ ఎన్‌టిఆర్ మార్గంలో 8 క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ట్యాంక్‌బండ్ మార్గంలో నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుందా లేదా సస్పెన్స్ నెలకొంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు సహాజ నీటి వనరుల్లో మట్టి విగ్రహాలను తప్ప పిఒపితో తయారు చేసిన ప్రతిమలను నిమజ్జనం చేయరాదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు కోర్టు అదేశాల మేరకే ఏర్పాట్లను చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడిని సైతం నిర్వాహకులు మట్టితోనే తయారు చేయించారు. దీంతో ఖైరతాబాద్‌లో కొలువుదీరిన పంచముఖ మహా లక్ష్మీగణపతి హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం కానుంది. ప్రతి ఏటా ఎన్‌టిఆర్ మార్గంలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రక్రియను తిలకించేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలి వస్తుండంతో ఈ ఏడాది కూడా జిహెచ్‌ఎంసితో పాటు సంబంధిత శాఖలు ఎన్‌టిఆర్ మార్గంలో భారీగా ఏర్పాట్లను చేస్తున్నారు.

ఈ ఏడాది స్థానికంగానే నిమజ్జనం
ఈ ఏడాది వినాయకుల నిమజ్జనానికి సంబంధించి స్థానికంగా జిహెచ్‌ఎంసి భారీ ఏర్పాట్లను చేస్తోంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పిఒపి విగ్రహాలను చెరువులు, కుంటల్లో కాకుండా ప్రత్యేక కొలనుల్లో నిమజ్జనం చేసేందుకు పక్కా ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది నిమజ్జనం అనుమతులకు సంబంధించి హుస్సేన్ సాగర్ పాయింట్‌ను పోలీసు శాఖ తొలగించింది. దీంతో మట్టి వినాయకులు తప్ప ఇతర పిఒపి విగ్రహాలను తరలి రాకుండా ముందస్తూ జాగ్రత్తలను తీసుకున్నారు. ఇదే క్రమంలో వినాయక ప్రతిమల నిమజ్జనం స్థానికంగా సాఫీగా సాగేందుకు నగరంలో ఇప్పటికే ఉన్న 28 ప్రత్యేక నిమజ్జనం కొలనులతో పాటు 46తాత్కాలిక కృతిమ (పార్తెబుల్) కొలన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలో ప్రధాన ప్రాంతాల్లోని మైదానాలు ఇతర విశాలమైన స్థలాల్లో 6 అడుగు వరకు ఉన్న విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు రబ్బర్ ట్యాంకులను అంతకన్న ఎత్తున్న విగ్రహాల నిమజ్జనానికి ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక గుంతలు తవ్వి వాటిలో నిల్వచేసి ఇందులో నిమజ్జనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

నిమజ్జనానికి 280 క్రేన్లు
ఈ ఏడాది నిమజ్జనానికి గ్రేటర్ వ్యాప్తంగా 280 క్రేన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో సుమారు 130 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా వినాయక శోభ యాత్ర సాఫీగా సాగేందుకు ఇప్పటీకే ఆయా మార్గాల్లో చెట్ల కొమ్మలను తొలగించడంతో పాటు అడ్డుగా ఉన్న విద్యుత్, కేబుల్ ఇతర తీగలను ఆయా విభాగాల సిబ్బంది సరి చేస్తున్నారు. అంతేకాకుండా నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో మొత్తం 100మంది గజ ఈతగాళ్లతో పాటు ప్రత్యేక బోట్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జన పరిసరా ప్రాంతాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రపర్చేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 10 వేల మంది శానిటేషన్ సిబ్బంది నియమిస్తుండగా వీరంతా 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా ప్రతి షిప్డులో సుమారు 3600 మంది చోప్పున మూడు షిప్టుల్లో పనిచేసే విధంగా కార్యచరణ రూపొందించారు. అంతేకాకుండా నిమజ్జనం సాగే మార్గాల్లో 3 నుంచి 4 కిలో 25 శానిటేషన్ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జనం సాగే కొలనుల వద్ద ఒక క్రేన్ కు 7 నుంచి 14 వరకు సిబ్బంది 3 షిఫ్టుల్లో 24 గంటలు పని చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా జిహెచ్‌ఎంసి, రెవెన్యూ, జలమండలి, విద్యుత్, హెచ్‌ఎండిఎ, పోలీసు, ఆర్ అండ్‌బి తదితర సంబంధింత శాఖ అధికారులతో కంట్రోల్ రూంను ఏర్పాటు చేయడం ద్వారా ఆయా శాఖల ద్వారా అందాల్సిన సేవలను సమన్వయం చేయనున్నారు.

మేయర్ సమీక్ష
గణేష్ నిమజ్జోత్సవంపై శనివారం జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మిజిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఈనెల 9న నిర్వహించనున్న ని మజ్జనం ఏర్పాట్లపై మేయర్ జోనల్ కమిషనర్‌లు, పోలీస్, విద్యుత్ శాఖ, వాటర్ వర్క్స, ఈ విడిఏం శాఖల అధికారులతో శనివారం మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ నిమజ్జనం సాఫీగా ప్రశాంతంగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. శాఖలవారీగా బాధ్యతలను అప్పగించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయడం ద్వారా నిమజ్జనం ప్రక్రియ విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఈ ఏన్ సిజియోద్దిన్, జోనల్ కమిషనర్‌లు రవి కిరణ్, శంకరయ్య, శ్రీనివాసరెడ్డి, మమత, పంకజ, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ అధికారి డాక్టర్ పద్మజ, వాటర్ వర్క్ ఎలక్ట్రిసిటి, చార్మినార్ జోన్ ఎస్‌ఈ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News