మరికొందరు మావోయిస్టు కమాండర్ల ఏరివేత లక్షం
ఆపరేషన్ ప్రహర్3 చేపట్టాలని నిర్ణయం
రాయ్పూర్/న్యూఢిల్లీ : చత్తీస్గఢ్లోని బీజాపూర్ ఎన్కౌంటర్లో ఊహించని రీతిలో తీవ్ర నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు భద్రతబలగాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. జరిగిన నష్టానికి బదులు తీర్చుకోవాలని రగిలిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగా ఆపరేషన్ చేపట్టాలని ప్రభుత్వం గట్టిగా ఆదేశించినట్లు సమాచారం. శనివారంనాటి ఎన్కౌంటర్ వెనక ఉన్న ప్రధాన సూత్రధారి, మావోయిస్టు అగ్రనేత హిడ్మాను లక్షంగా చేసుకుని ‘ఆపరేషన్ ప్రహర్3’ చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి. మావోయిస్టు బెటాలియన్ కమాండర్ హిడ్మాను వాడుకొని భద్రతా బలగాలను మావోయిస్టులు ట్రాప్ చేశారు.
ఇప్పడు భద్రతా బలగాలు అదే హిడ్మాను టార్గెట్ చేస్తూ ఈ ఆపరేషన్కు రంగం సిద్ధం చేశాయి. హిడ్మాతో పాటు మరో 8 మంది మావోయిస్టు కమాండర్ల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్షా అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఇంటెలిజెన్స్ అధికారులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ‘నక్సలైట్లకు వ్యతిరేకంగా ఆపరేషన్ను ముమ్మరం చేయండి. మానవ మేధస్సుతో పాటు సాంకేతికతను కూడా బాగా వాడండి. మిగతా భద్రతా సంస్థలు కూడా సహాయం చేస్తాయి’ అని అమిత్షా అన్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర భద్రతా బలగాలు ‘మోస్ట్వాంటెడ్’ జాబితాను రూపొందించింది. అందులో మావోయిస్ట్ టాప్ కమాండర్తో పాటు మరో ఎనిమిది మంది జాబితాను రూపొందించారు.