రాష్ట్రపతిని కలిసిన విపక్ష బృందం
న్యూఢిల్లీ: రైతుల ఆందోళన దశలో వారి మరణాలు, పెగాసస్, వ్యవసాయ చట్టాల వంటి అంశాలతో ప్రతిపక్ష పార్టీల బృందం శనివారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలుసుకుంది. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) నాయకత్వంలో ఎన్సిపి, జెకెఎన్సిల నేతలు రాష్ట్రపతిని కలిసి వివిధ పార్టీల ప్రతినిధులతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్రపతికి అందించింది. దేశంలో కొన్ని ప్రాంతాలలో రైతుల మరణాల ఉదంతంపై జెపిసి ఏర్పాటు, పెగాసస్ స్నూపింగ్ వివాదం, రైతుల సమస్యలపై పార్లమెంట్లో చర్చకు కేంద్రాన్ని ఆదేశిస్తూ రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని ఈ బృందం కోరింది. అయితే ఈ విజ్ఞప్తిపై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సంతకం లేదు. శివసేన, బిఎస్పి, సిపిఐ, సిపిఎం, ఆర్ఎల్పి వంటి పార్టీల సంతకాలు ఉన్నాయి. వ్యవసాయ చట్టాల దశలో పలువురు రైతులు చనిపొయ్యారు. వీటికి సంబంధించి నిజానిజాలను నిర్థారించాలి. ఇందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘం (జెపిసి) ఏర్పాటు కావల్సి ఉందని ఈ బృందం తరఫున ఆ తరువాత ఎస్ఎడి నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్రపతి స్పందన అత్యవసరం అని విలేకరుల సమావేశంలో చెప్పారు.