98% ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు తెలంగాణ రాష్ట్రసమితి మద్దతుదారుల కైవసం
747 ప్యాక్స్లకు 79.36% పోలింగ్
904 సంఘాలలో దాదాపు 890 అధికారపార్టీవే
2,017 డైరెక్టర్ల పదవులున్న 157 ప్యాక్స్లు ఏకగ్రీవం
మొత్తం 5,405 మంది డైరెక్టర్లు పోటీ లేకుండా ఎన్నిక
ఎన్నిక జరిగిన డైరెక్టర్ పదవులు 6,248
మొత్తం ఓటర్లు 11,48,759, ఓటు వేసిన వారు 9,11,599, పలు జిల్లాల్లో టిఆర్ఎస్ క్లీన్స్వీప్
నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
17న డిసిసిబిలకు నోటిఫికేషన్, 24న అధ్యక్షుల ఎన్నిక
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు(ప్యాక్స్) శనివారం జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ మద్ధతుదారులే అత్యధికంగా గెలుపొందా రు. దీంతో 98 శాతం ప్యాక్స్లు టిఆర్ఎస్ మ -ద్ధతుదారులకే దక్కనున్నాయి. పూర్తిగా రైతులే ఓటర్లుగా ఉన్న ఎన్నికలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎకరాకు రూ.5 వేలు, రైతుబీమా వంటి ప్రతిష్ఠాత్మక పథకాల లబ్ధి జరుగుతుండటంతో అధికార పార్టీ మద్ధతుదారులకే అన్నదాతలు జై కొట్టారు. పార్టీ గుర్తులతో జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల వరకు ప్రతీ దాంట్లోనూ టిఆర్ఎస్ గెలుపు బావుటా ఎగరవేసింది. మంచి ఊపులో ఉన్న టిఆర్ఎస్.. పార్టీలకు అతీతం గా పార్టీల గుర్తులు లేకుండా జరిగిన ప్యాక్స్ ల ఎన్నికల్లోనూ గెలుపు జెండా ఎగురవేసిం ది. మొత్తం 904 ప్యాక్స్లకు ఎన్నికలు జరగగా, దాదాపు 890 ప్యాక్స్లను టిఆర్ఎస్ మద్ధతుదారులే కైవసం చేసుకున్నారు. మొ త్తం 11,653 డైరెక్టర్ పదవులకు నోటిఫికేషన్ చేయగా, నామినేషన్లు ఉపసంహరణకు 5405 మంది డైరెక్టర్లు ఏకగ్రీవమయ్యారు. ఇందులో 2017 డైరెక్టర్ పదవులున్న 157 ప్యాక్స్లు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 99 శాతం టిఆర్ఎస్ మద్ధతుదారులే ఉండటం గమనార్హం. అలాగే శనివారం జరిగిన 6248 డైరెక్టర్ పదవుల ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ మద్ధతుదారులే అత్యధికంగా గెలుపొందారు. టిఆర్ఎస్ బలం, ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై ఉన్న విశ్వాసం ముందు ఇతర పార్టీలు నిలబడలేకపోతున్నాయనడానికి ఇది మరొక ఉదాహరణ. వరుస ఓటములతో విపక్ష పార్టీలు సహకార ఎన్నికలను అసలు పట్టించుకోలేదు. అదే సమయంలో వరుస విజయాలతో ఊపు మీదున్న టిఆర్ఎస్ మళ్లీ గెలుస్తామనే గర్వంతో కాకుండా పకడ్బందీగా వ్యవహరించారు. పార్టీ అధిష్టానం ముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అత్యధికంగా 45 శాతం డైరెక్టర్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. అవన్నీ టిఆర్ఎస్ ఖాతాలో చేరాయి. ఆ తరువాత ఎన్నికలు జరిగిన డైరెక్టర్ పదవులను కూడా దక్కించుకునేందుకు స్థానిక టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులను రంగంలోకి దింపింది. సహకార ఎన్నికల బాధ్యతలను పార్టీ అధిష్టానం స్థానిక ఎంఎల్ఎలకు అప్పగించింది. ఎవరికి అవకాశం ఇవ్వాలి, భవిష్యత్లో వారు పార్టీకి ఏమేరకు ఉపయోగపడతారనే అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఓటర్ల జాబితాను తీసుకుని రైతులతో నేరుగా మాట్లాడి ఓట్లు పడేలా చర్యలు తీసుకున్నారు. రైతుల కోసం కృషి చేస్తున్న సిఎం కెసిఆర్ను రైతులు ఎప్పటికీ మరిచిపోరని, ఎన్నికలు ఏవైనా ప్రజలు టిఆర్ఎస్కే పట్టం కడుతారని ప్యాక్స్ ఎన్నికల్లో గెలిచిన టిఆర్ఎస్ మద్ధతుదారుడైన ఒక డైరెక్టర్ మన తెలంగాణతో వ్యాఖ్యానించారు. ఇది కెసిఆర్ పుట్టిన రోజుకు ఈ గెలుపు రైతుల బహుమానం అన్ని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ప్యాక్స్ల ఛైర్మెన్లు, వైస్ ఛైర్మెన్లతో పాటు ఉమ్మడి జిల్లాలల్లోని తొమ్మిది డిసిసిబిలను కూడా టిఆర్ఎస్ తన ఖాతాలో వేసుకోనుంది.
సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతం
747 ప్యాక్స్లకు 79.36 శాతం పోలింగ్
6248 డైరెక్టర్ పదవులకు ఫలితాలు ప్రకటించిన రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఇప్పటికే 157 ప్యాక్స్లు పూర్తిగా, మరో 3388 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవమైనట్టు ప్రకటించింది.
17న డిసిసిబిలకు నోటిఫికేషన్… అధ్యక్షుల ఎన్నిక 24కు పూర్తి
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే మధ్యాహ్నాం ఒంటి గంట నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి గెలుపొందిన పాలకవర్గాలను కూడా ప్రకటించారు. 747 ప్యాక్స్లలో 6248 ప్రాదేశిక నియోజకవర్గలకు (డైరెక్టర్లకు) జరిగిన ఎన్నికల్లో 79.36 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సంఘాలలో మొత్తం 11,48,759 మంది ఓటర్లు ఉండగా, 9,11,599 మంది రైతులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 89.82 శాతం ఓటింగ్ నమోదు కాగా, అత్యల్పంగా నారాయణ్పేట జిల్లాలో 55.78 శాతం నమోదైనట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ శనివారం వెల్లడించింది. జనవరి 31వ తేదీన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 906 ప్యాక్స్లకు గాను ఫిబ్రవరి 3వ తేదీన 904 ప్యాక్స్లలోని 11,653 డైరెక్టర్ పదవులకు ఎన్నికల నోటీసులు ఇచ్చారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత 157 ప్యాక్స్లలో ఉన్న మొత్తం 2017 డైరెక్టర్లు ఏకగ్రీవమయ్యారు. అలాగే మిగిలిన సొసైటీల్లోని 3388 డైరెక్టర్ పదవులు కలిపి మొత్తంగా 5405 ఏకగ్రీవమయ్యాయి. దీంతో శనివారం 747 సొసైటీల్లోని 6248 డైరెక్టర్ పదవులకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 14,530 మంది డైరెక్టర్ పదవులకు పోటీ పడ్డారు. ఆ తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించారు. పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలైనప్పటికీ ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ మద్దతుదార్లను గెలిపించుకొనేందుకు శర్వశక్తులూ ఒడ్డాయి.
ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ ఎన్నిక
ప్యాక్స్లకు ఎన్నికైన డైరెక్టర్లు 11,653 మంది 904 ప్యాక్స్లకు ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్లను ఆదివారం ఎన్నుకోనున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల స్వీకరణ అనంతరం, చేతులెత్తే పద్ధతి ద్వారా ఛైర్మెన్ను, వైస్ ఛైర్మెన్ను ఎన్నుకుంటారు. అనంతరం జిల్లా కలెక్టర్లు వారి పేర్లను రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీకి పంపిస్తారు. అనంతరం వారి పేర్లను అధికారికంగా వెల్లడిస్తారు. ప్యాక్స్ ఛైర్మన్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి) అధ్యక్షులను ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో డిసిసిబి అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. పాత జిల్లాల ప్రాతిపదికనే డిసిసిబి అధ్యక్షులను ఎన్నుకుంటారు. ఈ నెల 24వ తేదీ నాటికి డిసిసిబి అధ్యక్షుల ఎన్నిక పూర్తవుతుంది.
ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఛైర్మన్ను ఎన్నుకునే ప్రక్రియ మొదలవుతుంది. డిసిసిబి అధ్యక్షులు టెస్కాబ్ ఛైర్మన్ను ఎన్నుకుంటారు. టెస్కాబ్ ఛైర్మన్ ఎన్నిక ఈ నెల 29వ తేదీ నాటికల్లా పూర్తిచేస్తారు. దీంతో మొత్తం సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లు అవుతుంది. అత్యంత తక్కువ సమయంలో ఈ ఎన్నికలను సహకారశాఖ సమర్థవంతంగా నిర్వహించిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్యాక్స్ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వాట్సాప్ను అత్యధికంగా వినియోగించుకుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో ఒక గ్రూపును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆదేశాలను వాట్సాప్ ద్వారానే జారీ చేసింది. దీంతో సమయం ఎంతో కలిసివచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు.
PACS Elections 2020 Ended in Telangana