Thursday, April 25, 2024

పాలమూరును హైదరాబాద్ స్థాయిలో మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతాం: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా ఉన్న దేశమైనప్పటికీ స్వాతంత్రం ఏర్పడినప్పటి నుంచి కూడా అత్యల్ప వైద్య సదుపాయాల విషయంలో దేశ ప్రజలు ఇబ్బందులు పడ్డారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మెడికల్ కళాశాలల కేటాయింపులో తెలంగాణపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో మెడికల్ విద్యకు సరైన అవకాశాలు లేక ఉక్రెయిన్ లాంటి దేశాలకు వెళ్లి అక్కడ సంభవించిన యుద్ధం వల్ల మన విద్యార్థులు కష్టాలు పడాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రం ఏర్పడేందుకు ముందు కేవలం మూడే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండేవని, తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొత్తగా 20 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు.

మెడికల్ కళాశాలల ఏర్పాటు వల్ల వైద్య విద్యను అభ్యసించేందుకు ఇతర దేశాలపై ఆధారపడడం సాధ్యమైనంత మేర తగ్గుతుందన్నారు. వైద్యుల సంఖ్య పెరిగి మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో తొలి మెడికల్ కళాశాల మనదే అవ్వడం మహబూబ్ నగర్ జిల్లా వాసుల అదృష్టమని శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు. పాలమూరును హైదరాబాద్ స్థాయిలో మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ప్రజలకు స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు రూ 500 కోట్లతో పాత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధునాతన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు త్వరలోనే చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. మినీ ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్, ఐలాండ్, సస్పెన్షన్ బ్రిడ్జ్, శిల్పారామం మొదలైన నిర్మాణాల వల్ల మహబూబ్ నగర్ పట్టణం పర్యటకానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News