తమిళనాడు ప్రజలకు రాహుల్ పిలుపు
నాగర్కోయిల్: ఒకే సంస్కృతి, ఒకే జాతి, ఒకే చరిత్ర అనే భావనను ప్రచారం చేస్తూ భాషకు, సంస్కృతికి ప్రతికూలంగా మారిన శక్తులను దూరం పెట్టి భారతదేశానికి మార్గం చూపాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తమిళనాడు ప్రజలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం నాడిక్కడ ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తమిళ ప్రజలు తప్ప వేరెవ్వరూ తమిళనాడును పాలించలేరని చరిత్ర చెబుతోందని అన్నారు.
తమిళ ప్రజలకు ప్రతినిధిగా తమిళనాడుకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారని ఈ ఎన్నికలు మరోసారి రుజువుచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి సాగిలపడే తమిళనాడు ముఖ్యమంత్రి(కె పళనిస్వామి)కి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని, రాష్ట్ర ప్రజలకు మాత్రమే ముఖ్యమంత్రి సాగిలపడాలని రాహుల్ అన్నారు. తమిళ భాషను, సంస్కృతిని ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీ అవమానిస్తున్నారని, తమిళనాడు ప్రజలు వారు ఈ రాష్ట్రంలో అడుగుమోపడానికి అవకాశం ఇవ్వకూడదని ఆయన కోరారు.
ఒకే సంస్కృతి, ఒకే జాతి, ఒకే చరిత్ర, ఒకే నాయకుడు అంటూ మోడీ మాట్లాడుతున్నారని, తమిళం భారతీయ భాష కాదా అని రాహుల్ ప్రశ్నించారు. బెంగలీ భారతీయ భాష కాదా, తమిళ సంస్కృతి భారతీయ సంస్కృతి కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో దీనిపైనే పోరాడాలని ఆయన కోరారు. భారతదేశంలోని అన్ని భాషలను, మతాలను రక్షించాల్సిన బాధ్యత తనపైన ఉందని, అదే విధంగా తమిళ భాషను, సంస్కృతిని కాపాడడం తన బాధ్యతని ఆయన అన్నారు.