Tuesday, April 16, 2024

పామాయిల్ కంపెనీల ఉల్లంఘనలు

- Advertisement -
- Advertisement -

వ్యవసాయ మంత్రిత్వ శాఖ డేటాను పరిశీలించినప్పుడు ఇతర ప్రాంతాల్లోని పామాయిల్ తోటల్లో కూడా కంపెనీలు ఒప్పందాలను అమలు జరపలేదు. ఇండోనేసియా వ్యాప్తంగా ప్రతి ఏటా వందల మిలియన్ డాలర్లు స్థానిక తెగలు నష్ట పోతున్నారు. తమ ప్లాంటేషన్లను స్థానిక కమ్యూనిటీలతో పంచుకోవటానికి చేసిన వాగ్దానాలను, చట్టపరమైన హక్కులను నెరవేర్చటంలో విఫలమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 కంపెనీల డేటాను ఐక్య బృందం రూపొందించింది. అందులో కోల్ గేట్-పామోలివ్, రెకిట్ లాంటి సంస్థలు ఉన్నాయి. జాన్సన్ & జాన్సన్ కెల్లాగ్స్ కంపెనీలు సలీమ్ గ్రూప్ నుంచి పామాయిల్‌ను కొనుగోలు చేస్తాయి. సలీమ్ కంపెనీకి ఒరాంగ్ రింబా భూమిలో తోటలు ఉన్నాయి. ప్లాస్మా నిబంధనలు పాటించటంలో విఫలమై నిషేధాలు ఎదుర్కొంటున్న అనేక కంపెనీలకు సరఫరా జరుగుతూనే ఉంది.

ఇండోనేసియాలోని గిరిజన జాతులను పామాయిల్ కంపెనీలు దారుణంగా దోపిడీ చేస్తున్నాయి. వారి భూములను మోసపు వాగ్దానాలతో స్వాధీనం చేసుకుంటున్నాయి. మోసపోయి భూము లు కోల్పోయిన గిరిజనులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ప్రపంచ వ్యాపితంగా వంట నూనెల వాడకంలో పామాయిల్ అత్యధికంగా ఉంది. పామాయిల్ సాగు, ఉత్పత్తిలో ఇండోనేసియా అగ్ర స్థానంలో ఉంది. విదేశీ కంపెనీలు పామాయిల్ వ్యాపారం ద్వారా వేల కోట్ల రూపాయలు లాభాలు పొందుతుంటే, పామాయిల్ తోటలకు కేంద్రంగా ఉన్న గిరిజన తెగల ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. భూములు కోల్పోయిన గిరిజన ప్రజలకు ఉపాధి సమస్యగా మారటమే కారణం.బిబిసి ప్రతినిధి బృందం పరిశీలనలో మత్ యాడి అనే గిరిజనుడు నదీ మార్గాన బయలుదేరగా అతని చేతిలోని ఈటె వేటాడడానికి సిద్ధంగా ఉంది. అయినా వేటకు ఏ జంతువు దొరక లేదు. అంతకు ముందు జింకలు, ముళ్ల పందులు లాంటి జంతువులు ఉండేవి. అవి ఇప్పుడు దొరకటం లేదు. మత్ యాడి ఇండోనేసియాలో విదేశీ కంపెనీల వలన అంతరించిపోతున్న సంచార తెగలలో ఒరాంగ్ రింబా తెగకు చెందిన వాడు. ఈ తెగకు చెందిన వారు సుమత్రా ద్వీపంలోని అడవిలో నివసిస్తున్నారు. రబ్బరు పండించటం, వేటాడటం, పండ్లను సేకరించటం వారి ప్రధాన వృత్తి.

1990 ఒక పామాయిల్ కంపెనీ డబ్బులు ఇస్తామని అభివృద్ధి చేస్తామంటూ మారుమూల ప్రాంతమైన టెబింగ్ టింగికి వచ్చింది. మాయ మాటలతో పూర్వీకుల నుంచి హక్కుగా పొంది ఉన్న వారి భూములను స్వాధీనం చేసుకుంది. భూముల్లో పామాయిల్ మొక్కలు నాటింది. స్థానికుల నుంచి వ్యతిరేకత రాకుండా చేసుకునేందుకు ఆ ప్రాంత ఆర్ధికాభివృద్ధికి హామీ ఇచ్చింది. ప్రభుత్వం నుంచి పెట్టుబడి సమకూర్చుకునేందుకు ‘ప్లాస్మా’ ( అభివృద్ధి చేసిన భూమిలో ఇచ్చే వాటా భూమి) అని పిలిసే ప్లాట్లలో స్థానికులకు భాగం కల్పిస్తామని చెప్పింది. 2007 ఇండోనేసియా చట్ట ప్రకారం కంపెనీలు కొత్తగా ఫ్లాంట్లేషన్ మొదలు పెడితే అందులో 5 వంతు కమ్యూనిటీలకు ఇవ్వాలి. ఇంకా అనేక కంపెనీలు ఇలాంటి వాగ్దానాలు చేశాయి. కంపెనీలన్నీ ఇచ్చిన హామీలను అమలు జరపలేదు. చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చలేదు ఇండోనేసియాలో గిరిజన తెగల ప్రజల సమస్యల తీవ్రతను తెలుసుకోవటానికి గత రెండు సంవత్సరాలుగా పరిశోధనాత్మక జర్నలిజం నిర్వహిస్తున్న ‘ది గెక్కో ప్రాజెక్టు, పర్యావరణ వార్తల సైట్ మొంగాబ్‌తో ఒక బృందంగా కూడా బిబిసి పని చేసింది.

ఈ బృందం పరిశోధన ప్రకారం ఒక్క సెంట్రల్ కాలి మంతన్ ప్రావిన్స్‌లోనే ప్లాస్మా రూపంలో స్థానికులకు ఇవ్వాల్సిన భూమి 2.5 లక్షల ఎకరాలను కంపెనీలు ఇవ్వలేదు. ఈ భూముల విస్తీర్ణత లాస్ ఎంజల్స్ నగరమంత ఉంది. ఇవన్నీ ప్రభుత్వ డాక్యుమెంట్లలో వెల్లడైన వివరాలే. పామాయిల్ నుండి లభించే లాభాలను కొలిసే సాంప్రదాయ ప్రమాణాల ప్రకారం స్థానిక తెగలు ప్రతి సంవత్సరం 90 మిలియన్ల డాలర్లు (667కోట్లు) నష్టపోయారు. ఇండోనేసియాలో కార్పొరేట్ కంపెనీల మొత్తం పామాయిల్ సాగులో ఈ ప్రాంతంలోనే ఐదవ వంతు ఉంది.
వ్యవసాయ మంత్రిత్వ శాఖ డేటాను పరిశీలించినప్పుడు ఇతర ప్రాంతాల్లోని పామాయిల్ తోటల్లో కూడా కంపెనీలు ఒప్పందాలను అమలు జరపలేదు. ఇండోనేసియా వ్యాప్తంగా ప్రతి ఏటా వందల మిలియన్ డాలర్లు స్థానిక తెగలు నష్ట పోతున్నారు.

తమ ప్లాంటేషన్లను స్థానిక కమ్యూనిటీలతో పంచుకోవటానికి చేసిన వాగ్దానాలను, చట్టపరమైన హక్కులను నెరవేర్చటంలో విఫలమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 కంపెనీల డేటాను ఐక్య బృందం రూపొందించింది. అందులో కోల్ గేట్-పామోలివ్, రెకిట్ లాంటి సంస్థలు ఉన్నాయి. జాన్సన్ & జాన్సన్ కెల్లాగ్స్ కంపెనీలు సలీమ్ గ్రూప్ నుంచి పామాయిల్‌ను కొనుగోలు చేస్తాయి. సలీమ్ కంపెనీకి ఒరాంగ్ రింబా భూమిలో తోటలు ఉన్నాయి. ప్లాస్మా నిబంధనలు పాటించటంలో విఫలమై నిషేధాలు ఎదుర్కొంటున్న అనేక కంపెనీలకు సరఫరా జరుగుతూనే ఉంది. అలా సరఫరా అవుతున్న కంపెనీల్లో జాన్సన్ &జాన్సన్, కెల్లాగ్, మోండెల్జ్ ఉన్నాయి.
పామాయిల్ తోటల పెంపకంతో కంపెనీలకు డబ్బుల వర్షం కురిసింది .పెద్ద ఎత్తున పంట మిల్లుకు చేరింది. సలీమ్ గ్రూప్ సంస్థ మిలియన్ డాలర్ల ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తి చేసింది.

కార్పొరేట్ కంపెనీలు అత్యాశతో ఉన్నాయని అటవీ రంగాన్ని పర్యవేక్షిస్తున్న ఇండోనేసియా ఎంపి డేనియల్ జోహన్ చెప్పారు. పామాయిల్ కంపెనీలు ఒప్పందాలను అమలు జరపని ఫలితంగా ప్రజలు తీవ్రంగా ఆహార సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒరాంగ్ రింబాలో ప్రజల లాగానే తెగ పెద్ద సితి మణినా పండి రాలిన ఆయిల్ పండ్లను ఏరుకుని వాటిని అమ్మి జీవనం సాగిస్తున్నాడు. ఎక్కువగా పండ్లు దొరికినప్పుడు బియ్యం, కూరగాయలు కొనటానికి డబ్బులు ఉంటాయి. పామాయిల్ తోటలు మూలంగా ప్రపంచంలోనే అత్యంత జీవ వైవిధ్యం కల విస్తారమైన అడవులు ఇండోనేసియాలో నరికి వేశారు. ఒకప్పుడు అడవితో నిండి ఉన్న ఇండోనేసియా దీవులైన బోర్నియా, సుమత్రాలో ఇప్పుడు పామాయిల్ తోటలతో నిండిపోయాయి.

పామాయిల్ కంపెనీలు ప్లాస్మాను, ఒప్పందాలను అమలు జరపక పోవటంతో భూములు కోల్పోయిన గిరిజనులు గత ఆరు సంవత్సరాలుగా ప్రతి నెల ఫిర్యాదులతో నిరసన ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వాటిని నిర్బంధంతో అణచివేతకు ప్రభుత్వం పూనుకుంటున్నది. వివాద పరిష్కారానికి 2015లో స్థానిక రాజకీయ నాయకులు మధ్యవర్తిత్వం వహించిన ఒప్పందంలో సలీమ్ గ్రూప్ ప్లాస్మాను అందజేస్తానని వాగ్దానం చేసి కొత్త ఒప్పందంపై సంతకం చేసింది. అయినా ఒప్పందం అమలు జరగలేదు.

ఒప్పందాలు అమలు చేయని సలీమ్ గ్రూప్‌పై ప్రజలు ఆగ్రహం చెంది వారి తోటలను (అవి గిరిజనుల భూములే) ఆక్రమించారు. కంపెనీ గుడిసెలను కూల్చివేశారు. ప్రజలు ప్లాంటేషన్‌లోని సెక్యూరిటీ పోస్టుకు నిప్పుపెట్టి కంపెనీ ఆఫీసు అద్దాలు పగలగొట్టారు. సాయుధులైన పోలీసులు విరుచుకుపడి 40 మందికిపైగా ఉద్యమకారులను అరెస్టు చేశారు. తీవ్రమైన హింసలకు గురి చేశారు. ఏడుగురికి 18 నెలల జైలు శిక్ష విధించారు. ప్రజలు అన్ని విధాలా కంపెనీ దోపిడీ, దౌర్జన్యాలను ప్రతిఘటించారు. సమస్యకి ఎటువంటి పరిష్కారం లభించలేదు.

వ్యవస్థ విఫలతే ఇందుకు కారణమని ఇండోనేసియా ఎంపి డేనియల్ జోహన్ అన్నారు. ప్రజల నిరసనల తర్వాత ఒరాంగ్ రింబా తెగ పూర్వీకుల భూమిని తిరిగి ఇవ్వాలని పార్లమెంటరీ కమిషన్ సలీమ్ గ్రూప్‌ని కోరింది. కమిషన్ తీరు దొంగను బతిమిలాడుకున్న విధంగా ఉంది. సలీమ్ గ్రూప్ పార్లమెంటరీ కమిషన్ సూచనను పట్టించుకోలేదు. ఇండోనేసియా ప్రభుత్వానికి సలీమ్ గ్రూప్ లాంటి కంపెనీలపై చర్యలు తీసుకునే ధైర్యం లేదు. కారణం వాటి ప్రయోజనమే పాలకులకు ముఖ్యం కాబట్టి. తమ భూముల కోసం, ఒప్పందాల అమలు కోసం పోరాడుతున్న గిరిజన ప్రజలను నిర్బంధం ద్వారా అణచివేసే విధానాలు అనుసరిస్తున్న ఇండోనేసియా ప్రభుత్వం, పామాయిల్ కంపెనీల ప్రయోజనాల కోసం ఎడిబుల్ ఆయిల్ విదేశాలకు ఎగుమతులపై నిషేధాన్ని తొలగించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో పామాయిల్ కంపెనీలకు బాగా లాభాలు పెరిగి వాటి అధిపతులు బిలియనీర్లుగా మారారు. తమ భూముల కోసం, హక్కుల కోసం పామాయిల్ కంపెనీలకు వ్యతిరేకంగా గిరిజన తెగల ప్రజలు చేసే పోరాటం న్యాయమైనది. ప్రపంచ ప్రజలు అందరూ వారికి మద్దతు ఇవ్వాలి. బహుశజాతి కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడాలి.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News