మనతెలంగాణ/కొత్తగూడెం: రెవిన్యూ యంత్రాంగం అవినీతిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కూడా కొందరి వ్యవహార శైలిమారటం లేదు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ తహసీల్దార్ కార్యాలయం అడ్డాగా ఒక వీఆర్ఓ అవినీతికి తెరలేపారు. లంచం తీసుకుంటూ పాల్వంచ మండలంలోని యానంబైలు వీఆర్ఓ బాణోతు పద్మ మంగళవారం ఏసిబి అధికారులకు పట్టుబడ్డారు. ఏసిబి డిఎస్పీ మధుసూధనరావు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ మండలంలోని కిన్నెరసానికి చెందిన గుమ్మడి నాగమణి తన అన్న కూతురు రాజేశ్వరికి తల్లితండ్రులు లేకపోవటంతో 2018లో తనే పెళ్లి చేసింది. అయితే దానికి సంబంధించి కల్యాణలక్ష్మీ పథకంలో డబ్బులు వస్తాయని తెలిసి, పది రోజుల కిందట కల్యాణ లక్ష్మీకోసం దరఖాస్తు చేసింది.
అనంతరం కిన్నెరసాని, యానంబైలు వీఆర్ఓ బాణోతు పద్మను కలిసింది. ‘నీ పని అవ్వాలంటే రూ 10వేలు ఖర్చవుతుందని అందరి సంతకాలు పెట్టిస్తా, అంతా నేనే చూసుకుంటా’ అని వీఆర్ఓ పద్మ, దరాఖాస్తుదారు నాగమణికి హామీ ఇచ్చింది. దీనితో తాను రూ 10వేలు ఇవ్వలేనని, రూ.7వేలు మాత్రం ఇవ్వగలనని తెలిపింది. ఆ ఏడు వేలు కూడా వీఆర్ఓకు ఇవ్వడానికి మనసు అంగీకరించకపోవటంతో నాగమణి ఖమ్మంలోని ఏసిబి కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. దీనితో బుధవారం ఏసిబి డిఎస్పీ మధుసూధనరావు ఆధ్వర్యంలో అధికారులు పథకం ప్రకారం నాగమణి నుంచి రూ.7వేల లంచం తీసుకుంటుండగా వీఆర్ఓను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం వీఆర్ఓను ఏసిబి అధికారులు హైదరాబాద్కు తరలించారు.
Palvancha VRO Padma in ACB Trap