సంక్రాంతికి బ్లాక్బస్టర్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 27వ చిత్రాన్ని చేయాలని భావించారు. కానీ ఏదో కారణం వల్ల ఆ సినిమా కాస్త రద్దయింది. వంశీతో మూవీ రద్దయిన తర్వాత మహేష్ బాబు పలువురు దర్శకులతో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. పలువురు దర్శకులు మహేష్కు కథలు వినిపించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఆమధ్య ‘భీష్మ’ చిత్ర దర్శకుడు వెంకీ కుడుములకు కూడా ఈ సూపర్స్టార్ నుండి పిలుపు వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు 27వ చిత్రంపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరిగింది.
చివరకు మహేష్ తన 27వ చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా తెలిసింది. ఈ ప్రాజెక్ట్ దాదాపుగా ఖరారైందని సమాచారం. మైత్రి మూవీస్, 14 రీల్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారట. ఈ సినిమా కోసం మహేష్ బాబుకు భారీ పారితోషికాన్ని ఈ రెండు నిర్మాణ సంస్థల వారు ఇస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన అతి త్వరలో రానుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను జూలై నెలలో ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే దర్శకుడు పరశురామ్ స్క్రిప్ట్ వర్క్లో బిజీ అయ్యాడని తెలిసింది.
Parasuram to Direct Mahesh babu 27th movie!