మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా క్రియాశీల కార్యాచరణకు శ్రీకారం చుట్టిందని అంతర్జాతీయ వైద్యనిపుణులు, హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ డాక్టర్ కె.శ్రీనాథ్ రెడ్డి అన్నారు. కరోనా వైరస్ నియంత్రణ విషయంలో సిఎం కెసిఆర్ దేశానికే దిశా నిర్ధేశం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కరోనా కట్టడికి ఆయన హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ భారత్కు బాధ్యతలు నిర్వహిస్తున్న డా.జివిఎస్.మూర్తితో కలిసి ఆదివారం ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మెన్ బోయినపల్లి వినోద్కుమార్తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాపించి వైరల్ లోడ్గా రూపాంతరం చెందితే అత్యంత ప్రమాదకరమన్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండటం సరైన విధానమని ఆయన చెప్పారు. శ్వాస, గొంతు సమస్యలు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వ్యక్తి జన సమూహంలో పలుమార్లు రాకపోకలు సాగిస్తే సహజంగా ఆ వ్యాధి ఆయా వ్యక్తులకు సోకి వైరల్ లోడ్గా పరిణమిస్తుందని వైద్యనిపుణులు వివరించారని చెప్పారు. శ్వాస, గొంతు సమస్యలు, జ్వరం లక్షణాలు ఉన్న వ్యక్తి కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరిపినా, శుభకార్యాలు, సమావేశాలు, ఆయా మతాల కార్యక్రమాలకు వెళ్లినా జనంలో కలిసినా కరోనా వైరల్ లోడ్కు కారణం అవుతారని హెచ్చరించారు. అన్నింటికంటే ఉత్తమ మార్గం సామాజిక దూరం పాటిచడమని చెప్పారు. ఈ విధానాన్ని మరో రెండు నెలలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా గ్రామీణ ప్రాంతాల్లో నియంత్రణలోనే ఉందని, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఇది సమస్యగా మారిందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాక్, ట్రీట్, ట్రేస్ విధానం అనుసరణీయమన్నారు.
People follow social distance: Vinod Kumar