ఈ టీకాను డిక్లరేషన్తో ఇవ్వనున్న అధికారులు
జిల్లాలకు తరలివెళ్లిన 5,527 కొవిషీల్డ్ వయల్స్
స్టోరేజీ సెంటర్ల వద్ద స్పెషల్ సెక్యూరిటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన సంస్థ భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన టీకా డోసులు మనకూ ఇవ్వనున్నారు. ఈమేరకు కోఠి సెంట్రల్ స్టోరేజ్ కేంద్రానికి బుధవారం ఉదయం 4 గంటలకు 20 వేల డోసులు చేరుకున్నాయి. మరిన్ని డోసులు ఈనెల 18వ తేదిన తర్వాత రానున్నట్లు అధికారులు తెలిపారు. వీటిని కూడా ప్లస్ 2 నుంచి ప్లస్ 8 శీతల ఉష్ణోగ్రతల మధ్య నిల్వ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ టీకాలను లబ్ధిదారుడి డిక్లరేషన్ తీసుకొని మాత్రమే ఇవ్వనున్నారని ఆరోగ్యశాఖలోని ఓ ముఖ్య అధికారి మన తెలంగాణకు తెలిపారు. ఈ టీకాను క్లినికల్ ట్రయల్స్లో భాగంగానే ఇస్తున్నామని, కానీ ఎలాంటి గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ చెబుతోంది.
ఇప్పటికే కోవాగ్జిన్ వ్యాక్సిన్లను బ్రెజిల్ దేశంతో పాటు మన దేశంలోని మరో 12 రాష్ట్రాలకూ తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా వినియోగించిన టీకా వయల్స్ను మళ్లీ కొవిన్ సాప్ట్వేర్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఒకవేళ సగం టీకా ఉన్నప్పటికీ ఈ లిక్విడ్ని పారబోసి వయల్ను మాత్రం జాగ్రత్తగా సెంట్రల్ స్టోరేజ్కు పంపాలని అధికారులు అన్ని జిల్లాలకు సూచించారు. ప్రస్తుతం మనకు వచ్చిన వ్యాక్సిన్లు 6 నెలల వాలిటిడితో ఉండగా, మూత తెరస్తే కేవలం 4 గంటల్లోపూ ఆ టీకా ఎక్స్ఫైర్ అవుతుందని అధికారులు పేర్కొన్నారు.
స్టోరేజ్ సెంటర్ల వద్ద స్పెషల్ సెక్యూరిటీ…
కోవిడ్ టీకాను నిల్వ చేసిన స్టోరేజ్ సెంటర్ల వద్ద ప్రభుత్వం స్పెషల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ప్రత్యేకమైన భద్రతతో 24 గంటల పాటు పోలీసులు పర్యవేక్షించనున్నారు. అంతేగాక ప్రతి కోల్డ్చైన్ వద్ద సి.సి కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. వైదశాఖ ఉన్నతాధికారుల అనుమతి లేనిదే ఆ శాఖలో పనిచేసే సిబ్బందిని కూడా స్టోరేజ్ కేంద్రం లోపలికి అనుమతించబోమని అధికారులు తెలిపారు.
జిల్లాలకు 5527 కొవిషీల్డ్ వయల్స్….
హైదరాబాద్ నుంచి 33 జిల్లాలకు 5527 కొవిషీల్డ్ వయల్స్ను పంపించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్కో వయల్లో పది డోసులు ఉంటాయని పేర్కొంది. ఇప్పటికే వాటిని తొలి రోజు వ్యాక్సినేషన్ జరిగే 139 కేంద్రాలకు పంపించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ కేంద్రాల్లో ఇప్పటికే 55,270 మంది లబ్ధిదారులు కొవిన్ సాప్ట్వేర్లో నమోదయ్యారు. కానీ తొలి రోజు కేవలం 4170 మందికి మాత్రమే టీకాను ఇవ్వనున్నారు. మరోవైపు బుధవారం ఆదిలాబాద్ జిల్లాకు 237, భద్రాద్రి కొత్తగూడెం 70, హైదరాబాద్ 1807,
జగిత్యాల 84, భూపాలపల్లి 56,గద్వాల 88, కామారెడ్డి 80,కరీంనగర్ 154,ఖమ్మం 153, కొమరం భీం 28,మహబూబాబాద్ 172, మహబూబ్నగర్ 173, మంచిర్యాల 46,మెదక్ 79, మేడ్చల్ మల్కాజ్గిరి 327, ములుగు 50, నాగర్కర్నూల్ 23, నల్గొండ 128, నారాయణపేట్ 114, నిర్మల్ 134, నిజామాబాద్ 302, పెద్దపల్లి 38, సిరిసిల్లా 128, రంగారెడ్డి 119, సంగారెడ్డి 78,సిద్దిపేట్ 179, సూర్యపేట్ 47, వికారాబాద్ 46, వనపర్తి 66, వరంగల్ రూరల్ 58, వరంగల్ అర్బన్లో 264, యాదాద్రి జిల్లాలకు తొలి డోసు కింద 116 వయల్స్ను పంపించినట్లు అధికారులు తెలిపారు.