సంగారెడ్డి : పల్లెప్రగతి రెండు దశల్లో జరగడంతో గ్రామాల్లో ఎంతో మార్పువచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్రావు అన్నారు. పట్టణ ప్రగతితో కూడా పట్టణాల్లో ఎంతో మార్పురావడం ఖాయమని పేర్కొన్నారు. సంగారెడ్డిలో సోమవారం ఆయన పట్టణ ప్రగతిని ప్రారంభించారు. దశల వారీగా మున్సిపాలిటీల రూపురేఖలు మార్చుకుందామని పేర్కొన్నారు. మీ అవసరాలేమిటో చెప్పండీ.. ఆ మేరకు అభివృద్ది చేసుకుందామన్నారు.
కొత్త మున్సిపల్ చట్టం ప్రజలకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా ఇచ్చిందని పేర్కొన్నారు. పారదర్శకత, జవాబుదారితనం కోసం సిఎం కెసిఆర్ ఈ చట్టాన్ని తెచ్చారని తెలిపారు. గతంలో ఇంటికి అనుమతులు రావాలంటే ఎంతో కష్టంగా ఉండేదని, పేదలు ఇండ్లు కట్టాలంటే ఇబ్బందులు కలిగేవన్నారు. అలాంటి వాటిని నివారించేందుకు కొత్త చట్టం వచ్చిందని తెలిపారు.
75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి కేవలం ఒక్క రూపాయి కట్టి ధరఖాస్తు చేసుకుంటే సరిపోతుందన్నారు. దీనికి అనుమతులు అవసరమే లేదని పేర్కొన్నారు. 75 నుంచి 200 గజాల లోపు ఇల్లు కట్టుకోవాలంటే మీరే ఇంటి ప్లాన్ను నిబంధనల ప్రకారం సమర్పించి ధరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. నిబంధనలకు విరుద్దంగా కడితే మాత్రం 25రెట్లు జరిమానా ఉంటుందని వెల్లడించారు. ప్రజల్లో మార్పురావాలంటే చట్టాలతో భయం కలగాలన్నారు.
ప్రభుత్వ స్థలాలు, ఖాళీస్థలాల్లో, ఇంటిముందు 300 మొక్కలు నాటి వాటిని బ్రతికిస్తే వారికి కానుకగా ఓపెన్ జిమ్ ఏర్పాటుచేయిస్తామని హామీ ఇచ్చారు. ఇండ్లస్థలాలకు ఓనర్షిప్ సర్టిఫికేట్ కోసం ప్రజలు అడుగుతున్నారని, రెండు నెలల్లో జిల్లా కలెక్టర్ ఈ సర్టిఫికేట్లను అందజేస్తారని హామీ ఇచ్చారు. దీని కోసం ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ హన్మంతరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీ, అదనపు కలెక్టర్ రాజశ్రీషా, తదితరులు పాల్గొన్నారు.