న్యూఢిల్లీ: ఈ నెల 4వ తేదీనుంచి మొదలు కానున్న లాక్డౌన్ మూడో దశలో మరిన్ని కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా రెడ్జోన్లు మినహా గ్రీన్, ఆరంజ్ జోన్లలో క్షౌరశాలలు, సెలూన్లు తెరుచుకోవచ్చని శనివారం ప్రకటించింది. దీనితో పాటుగా ఈకామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా అన్ని రకాల వస్తువుల విక్రయానికి కూడా పచ్చ జెండా ఊపింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ఈ నెల 17 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటుగా జోన్లవారీగా ఆయా కార్యకలాపాలకూ అనుమతులు ఇచ్చంది. గ్రీన్, ఆరంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు కేంద్రం అనుమతించింది. అయితే మద్యం షాపులు మార్కెట్లు లాంటి వాటిలో ఉండకూడదు.
అలాగే రెడ్జోన్లలో కంటైన్మెంట్ జోన్లలో లేని మద్యం దుకాణాలకు కూడా అనుమతి ఇచ్చింది. అయితే షాపుల వద్ద కస్టమర్లు ఆరడుగుల భౌతిక దూరం పాటించడంతో పాటుగా ఒకే సారి అయిదుగురు వ్యక్తులకు మించి అనుమతించరాదు. గ్రీన్ జోన్లలో 50 శాతం ప్రయాణికులతో బస్సులు నడుపుకోవడానికి, అలాగే 50 శాతం సిబ్బందితో బస్సుడిపోలను తెరవడానికి కూడా అనుమతించారు. అయితే ఆరంజ్ జోన్లలో మాత్రం బస్సు సర్వీసులను అనుమతించరు. టాక్సీలు, క్యాబ్లలో మాత్రం ఒక డ్రైవరు, ఇద్దరు ప్రయాణికులను అనుమతించవచ్చు. అయితే అన్ని జోన్లలో కూడా హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, సినిమా థియేటర్లను తెరవడానికి మాత్రం అనుమతించరాదని కేంద్రం తెలియజేసింది.