మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్ ను తొలగించాలని సుప్రీంకోర్టులో న్యాయవాదులు జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్లు బుధవారం నాడు పిటిషన్ దాఖలు వేశారు. ఎపి సిఎం జగన్పై 30కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయన్న పిటిషనర్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఎపి సిఎం న్యాయ వ్యవస్థను దెబ్బతీస్తున్నారని, కుట్ర ప్రకారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వి రమణపై తప్పుడు ఆరోపణలు చేస్తూ లేఖ రాశారని, ఇలాంటి వ్యక్తి న్యాయ వ్యవస్థను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారన్నారు. మనీలాండరింగ్ కేసులను ఎదుర్కొంటున్నారని, అంతేకాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్ లో ఆరోపించారు. దీనిపై జ్యుడీషియల్ విచారణ జరిపించి తక్షణమే సిఎం పదవి నుంచి జగన్ ను తొలగించాలని విన్నవించారు.