Saturday, April 20, 2024

భగ్గుమంటున్న పెట్రో ధరలు

- Advertisement -
- Advertisement -

ఆరో రోజూ వడ్డన
మహారాష్ట్రలోని పర్బనీ జిల్లాలో రూ. 100
రాజస్థాన్‌లో 99 దాటిన పెట్రోల్

Petrol Diesel rates increased in India

న్యూఢిల్లీ / ఔరంగబాద్ : దేశవ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల ధరలు వరుసగా పెరుగుతూ చివరికి లీటర్‌కు వంద రూపాయల స్థాయికి చేరుకున్నాయి. మహారాష్ట్రలోని పర్బనీ జిల్లాలో అదనపు సుంకాల మిళితంతో చూస్తే ఇప్పుడు పెట్రోలు లీటర్‌కు వందరూపాయలు దాటింది. అక్కడి పరిణామాన్ని పెట్రోల్ డీలర్‌స సంఘం కార్యవర్గ సభ్యులు ఒకరు ఆదివారం తెలిపారు. ఆదివారం ఉదయం పెట్రోల్‌పై లీటరుకు 29 పైసల వంతున పెరిగింది. స్థానిక అదనపు సుంకాలు, వడ్డింపులతో ధర వంద దాటింది. మహారాష్ట్రలో పర్బనీ జిల్లాలోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉంది. పెట్రో ధరల పెంపుదలతో తాము ఇక్కట్లకు గురికావల్సి వస్తోందని డీలర్‌స సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. పర్బనీకి ఇంధనం 340 కిలోమీటర్ల దూరంలోని మన్మాడ్ నుంచి వస్తుందని, పది పైస లు చొప్పున ధర పెరిగినా తాము ప్రతి ట్యాంకర్‌కు అదనంగా రూ 3000 పెట్టాల్సి ఉంటుంది. దీనితో తమకు ఇంధన పెట్టుబడి వ్యయం రోజురోజుకూ పెరుగుతోందని కార్యవర్గ సభ్యులు అమోల్ భేడ్సూర్కర్ తెలిపారు. ఇప్పుడు ప్రతి లీటర్ రవాణా వ్యయం దాదాపు 21 పైసలు పడుతుందని, దీని భారం వినియోగదారుడిపై పడనే పడుతుందని వివరించారు.

రాజస్థాన్‌లో రూ 99 దాటిన పెట్రోల్

వరుసగా ఆరోరోజు కూడా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడంతో రాజస్థాన్‌లో ఆదివారం పెట్రోలు ధర లీటర్‌కు రూ 99 దాటింది. ఇక డీజిల్ లీటర్‌కు రూ 91 అయిం ది. ఆదివారం పెట్రోలు ధరలను లీటర్‌కు 29 పైసలు, డీజిల్ ధరలను 32 పైసలు వంతున పెంచారు. ఈ మేర కు ప్రభుత్వ ఆధీనంలోని రిటైల్ ఇంధన సంస్థలు అధికారిక ప్రకటన వెలువరించాయి. రాజస్థాన్‌లో దేశంలోనే అత్యధిక స్థాయిలో ఇంధనంపై వ్యాట్ విధిస్తుంది. దీనితో పెట్రో ధరలపై ప్రభావం పడింది. శ్రీగంగానగర్ నగరంలో పెట్రోలు రేటు లీటర్‌కు రూ 99.29 అయింది. ఇక డీజిల్ రేటు లీటర్‌కు రూ 91.17 అయింది.

ఢిల్లీలో పెట్రోల్ ధర రూ 88 ప్లస్

దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర ఇప్పుడు లీటర్‌కు రూ 88.73 అయింది. డీజిల్ ధరలు రూ 79.06కు పెరిగాయి. అయితే ఢిల్లీలో ప్రీమియం ఆయిల్ ధర రూ 91.56 గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధరలు ఇంతకు ముందెప్పుడూ లేనంతగా లీటర్‌కు రూ 95.21కు చేరాయి. డీజిల్‌ధర లీటర్‌కు రూ 86.04 అయింది.

కామన్‌కు కష్టాలు

వరుసగా ఆరురోజులుగా పెట్రో ధరలు పెరుగుతూ పోవడంపై కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. పలు చోట్ల ధరలతో సామాన్యుడిపై భారం పడుతోందని, పన్నులను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే పెట్రో ధరల పెంపుదలపై గత వారం చమురు వ్యవహారాల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. అత్యధిక స్థాయికి చేరుకుంటున్న ధరలకు విరుగుడుగా ఎక్జైజ్ సుంకాల తగ్గింపు సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఈ దిశలో ఎటువంటి ఆలోచనా లేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News