మనతెలంగాణ, హైదరాబాద్ : మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని బేగంపేటలోని ప్రకాష్నగర్లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా, నర్సంపేటకు చెందిన ఝాన్సీ(35) గాంధీ మెడికల్ కాలేజీలో పిజి మొదటి ఏడాది చదువుతోంది. యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఓ యువకుడితో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఝాన్సీని ఒప్పించేందుకు యత్నించగా నిరాకరించి నగరానికి వచ్చి ఒంటరిగా ఉంటోంది. తనకంటే చిన్న వారిని వివాహం చేసుకోనని చెప్పి తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంది. అక్కడి నుంచి వచ్చి ప్రకాష్ నగర్లోని అపార్ట్మెంట్లో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఉంటోంది. అందులో ఉండే ఇద్దరు యువతులకు కరోనా పాజిటివ్ రావడంతో ఇంటికి వెళ్లిపోయారు.
దీంతో మరింత ఒత్తిడికి గురైన యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఝన్సీ ఉంటున్న చిరునామా కూడా తల్లిదండ్రులకు తెలియకపోవడంతో తన మొబైల్ నుంచి అక్క కుమారుడికి వాట్సాప్లో లొకేషన్ షేర్ చేసి ఆత్మహత్య చేసుకుంది. యువతి తల్లిదండ్రులు నర్సంపేటలో బట్టల వ్యాపారం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బేగంపేట ఎస్సై నర్సింహులు తెలిపారు.