Friday, March 29, 2024

ఓయూలో నిరుద్యోగ డాక్టరేట్ నర్సయ్య ఆత్మహత్య?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ఉస్మానియాయూనివర్సిటీః ఓయూలో అనుమానస్పదస్థితిలో నిరుద్యోగ డాక్టరేట్ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. తమ తోటి విద్యార్థి మృతి చెందడంతో ఓయూలో ఒక్కసారిగా విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. ఓయూ న్యూ పిజి హాస్టల్స్ (యమున…రీసర్చ్‌స్కాలర్స్ హాస్టల్) రూమ్ నెంబర్ 3లో డా.నర్సయ్య (44) అనుమానాస్పదస్థితిలో మృతిచెంది ఉన్నాడు. డా.నర్సయ్య మరణ వార్త న్యూపిజి హాస్టల్ విద్యార్థులతోపాటు ఓయూ క్యాంపస్ అంతటా వ్యాపించడంతో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు న్యూ పిజి హాస్టల్ ముందు సోమవారం ధర్నాకు దిగారు. డా. నర్సయ్య మృతదేహాన్ని ఓయూ పోలీసులు అంబులెన్స్‌లోకి చేర్చినప్పటికీ.. విద్యార్థులు హాస్టల్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించకుండా అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు హాజరై మద్దతు పలికారు. కొద్ది సేపటి తర్వాత ఓయూ పోలీసులు ధర్నాకు దిగిన విద్యార్థులను చెదరగొట్టి కొంతమంది విద్యార్థి నాయకులను, విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత డా. నర్సయ్య మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం అంబులెన్స్ ద్వారా పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మండలం పాలడుగు గ్రామం దళితకుటుంబానికి చెందిన కొంపల్లి మారయ్య కొడుకు డా.కొంపల్లి నర్సయ్య. ఓయూ నుంచి ఎమ్మెస్సీ జాగ్రఫితోపాటు బియిడి కోర్సులను పూర్తి చేశాడు. అలాగే గత సంవత్సరం క్రితమే ఓయూ జాగ్రఫి విభాగం నుంచి పిహెచ్‌డి కూడా పూర్తి చేసిన నర్సయ్య డాక్టరేట్ కూడా పొందాడు. ఎలాంటి ఉద్యోగం లేకుండా ఉండటంతో గత కొంత కాలంగా డా.నర్సయ్య నిరాశ, నిస్పృహలతో ఉంటున్నట్లు కొంత మంది విద్యార్థులు చెబుతున్నారు. డా. నర్సయ్య ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అనుమానాలు హాస్టల్ విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. కాగా సోమవారం మధ్యాహ్నం సహచర విద్యార్థులు ఓయూ న్యూపిజి హాస్టల్ రూమ్ నెంబర్ 3వైపు చూడగా …రూమ్ ముందు ఉదయం వేసిన న్యూస్ పేపర్ అలాగే ఉండటం, తలుపు బయట గొళ్ళెం పెట్టకుండా లోపల నుంచి మాత్రమే గడియ పెట్టుకుని ఉన్నట్లు గమనించారు. దీంతో రూమ్ డోర్‌ను కొట్టి చూడగా తలుపు తీయలేదు. అనుమానం వచ్చిన విద్యార్థులు కిటికిలోంచి చూడగా డా. నర్సయ్య కిందపడిపోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే కర్రతో గడియతీసి తలుపులు తెరిచారు. దీంతో డా. నర్సయ్య మృతి చెంది ఉన్నట్లు గమనించారు. విషయం తెలియగానే విద్యార్థులు హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు. మృతుడు డా. నర్సయ్య కుటుంబానికి రూ. 25లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సంఘటన స్థలానికి ఈస్ట్‌జోన్ డిసిపి రమేశ్, కాచిగూడ ఎసిసి సుధాకర్, ఓయూ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డిలు చేరుకుని పెద్ద ఎత్తున పోలీస్‌బలగాలను మోహరింపచేశారు. ఈ ఘటనపై కేను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఓయూ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. మృతిపై పూర్తి వివరాలు పోస్ట్‌మార్టమ్ నివేదిక అందిన తర్వాత తెలియజేస్తామన్నారు. కాగా డా. నర్సయ్య మృతిపై ఈ నెల 18 న ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

PHD Scholar Sustained death in Osmania University

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News