న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్డౌన్ ముగిసిన తర్వాత దశల వారీగా జనజీవనాన్ని పునరుద్ధరించడానికి తీసుకోవలసిన ఉమ్మడి చర్యలను సూచించవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. లాక్డౌన్ను సంపూర్ణంగా ఎలా తొలగించాలో సూచనలు అందచేయాలని ముఖ్యమంత్రులను ప్రధాని కోరారు. ప్రజలు భౌతిక దూరం పాటించడానికి చేపట్టిన లాక్డౌన్ అనే ముఖ్యమైన అంశం కొంతమేరకు సత్ఫలితాలు ఇచ్చిందని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. మార్చి 20న మొదటిసారి ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోడీ నేడు లాక్డౌన్ నేపథ్యంలో దేశంలో కొరోనా వ్యాప్తి పరిస్థితిని చర్చించారు. దాదాపు 10 రోజుల క్రితం దేశంలో లాక్డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వ సాహసోపేతమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రులు ప్రశంసించగా ప్రాణనష్టం తగ్గించడానికే ఈ చర్య తీసుకోవలసి వచ్చిందని ప్రధాని వారికి వివరించారు.
రానున్న మరి కొన్ని వారాలలో కరోనా నిర్ధారణ పరీక్షలు, కరోనా వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారిని ఐసోలేషన్లో ఉంచడం, క్వారంటైన్ చేయడం వంటి అంశాలపైనే దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారు. అత్యవసర ఔషధాల సరఫరా, మందులు, వైద్య పరికరాల తయారీకి అవసరమైన ముడి సరుకుల లభ్యతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని ఆయన చెప్పారు. కాగా, లాక్డౌన్ను కొన్ని రాష్ట్రాలు మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రులను కోరారు. కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను జిల్లా స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన సూచించారు.