న్యూఢిల్లీః దేశభద్రతంతా భారత జవాన్ల చేతిలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం లఢఖ్లో పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఇంత కఠిన పరిస్థితుల్లోను దేశం కోసం పని చేస్తున్నారు. భద్రతా బలగాల శౌర్యానికి సెల్యూట్. భారత సైనికుల తెగువ వెలకట్టలేనిది. దేశమంతా మిమ్మల్ని చూసి స్పూర్తి పొందుతుంది. మీ ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ మరిచిపోదు. ప్రపంచం మొత్తానికి గట్టి సందేశం ఇచ్చాం. లఢఖ్ నుంచి కార్గిల్ వరకు మీ ధైర్యం అమోఘం. భారత శత్రువులకు గట్టి గుణపాఠం నేర్పారు. సరిహదుల్లో జవాన్ల వల్లే దేశం మొత్తం నిశ్చింతగా ఉంది. అమరులైన సైనికులకు మరోసారి నివాళి. ధర్యవంతులే శాంతిని కోరుకుంటారు. శాంతిపై భారత్కు ఉన్న నిబద్ధతను ప్రపంచమంతా గమనించింది. ఉత్తమమైన మానవ విలువల కోసం మనం పనిచేశాం. జవాన్ల త్యాగం నిరుపమానమైనది. ఆధునిక సాంకేతికతను, అభివృద్ధిని అందిపుచ్చు కుంటున్నాం. శాంతిని కోరుకున్నంత మాత్రాన చేతులు కట్టుకుని కూర్చోం.
ప్రతీ పోరాటంలో మనదే విజయం. సైనికుల ధైర్య సాహసాలు ప్రపంచానికి మనశక్తి ఏంటో చెప్పాయి. భారత్ బలమేంటో ప్రపంచానికి తెలుసు. భారత్ కు వ్యతిరేకంగా శతృవులు పన్నిన ప్రతి కుట్రను భగ్నం చేశాం. 14కార్ప్స్ దళాలు చూపిన తెగువను ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. మీరు ప్రదర్శించిన ధైర్యసాహాసాలు ప్రతి ఒకరి ఇంట్లో ప్రతిధ్వనిస్తున్నాయి. మీలోని అగ్నిని, ఆవేశాన్ని భారత శత్రువులు చూశారు. సామ్రాజ్య విస్తరణ యుగం ముగిసింది, ఇప్పుడు అభివృద్ధి యుగంలో ఉన్నాం. సామ్రాజ్యకాంక్ష ఉన్న దేశాలు చరిత్రలో కొట్టుకుపోయాయి. అలాంటి దేశాలు వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి. ఇక్కడ నేను మహిళా సైనికుల్ని చూస్తున్నా. కదనరంగంలో ఇలాంటి సందర్భం ప్రేరణను కలిగిస్తుంది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేశాం. లేహ్ నుంచి లడఖ్, సియాచిన్, కార్గిల్, గాల్వన్ సెలయేళ్ల నుంచి.. ప్రతి పర్వతం, ప్రతి కొండ భారతీయ సైనికుల సత్తాను చూసింది’ అని ప్రధాని మోడీ వివరించారు.
PM Modi Address Soldiers in Ladakh