కుషీనగర్ (ఉత్తరప్రదేశ్) : రామ్ మనోహర్ లోహియా ప్రవచించిన సమాజ్వాదం నుంచి ఇప్పటి సమాజ్వాద్ పార్టీ (ఎస్పి) దూరం అయిందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ వద్ద బుధవారం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన తరువాత జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా సమాజ్వాది పార్టీ నేతల వైఖరిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సమాజ్వాద్ ఇప్పుడు పరివార్వాద్ను (కుటుంబ కేంద్రీకృతం) రంగరించుకుందని ప్రధాని తెలిపారు. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు కుషీనగర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆరంభంతో రాష్ట్రంలో మొత్తం అంతర్జాతీయ విమానాశ్రయాల సంఖ్య నాలుగుకు చేరింది. త్వరలోనే అయోధ్య కూడా ఈ సౌకర్యాన్ని పొందుతుంది. గౌతమబుద్ధుడి మహా పరినిర్వాణ ఘట్టం జరిగిన స్థలానికి సమీపంలోనే ఈ ఎయిర్పోర్టును ప్రధాని ఆరంభించారు. ఉత్తరప్రదేశ్ నేల పలు విధాలుగా విశిష్టతను సంతరించుకుందని, చరిత్రను ఆపాదించుకుని ఉందని, అత్యధిక సంఖ్యలో దేశానికి ప్రధాన మంత్రులను అందించిన రాష్ట్రంగానే కాదు, రాముడు, కృష్ణుడు జన్మించిన నేలగా కూడా పేరొందిందని ప్రధాని తెలిపారు. ఇది ఓ చారిత్రక నేల అని కొనియాడారు. యుపిలో యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని ఈ సభలో ప్రధాని కొనియాడారు. నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు. భూకబ్జాదారులను అణచివేశారు. రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పనితీరుతో పేదలకు మేలు జరుగుతోందన్నారు.
స్వపరివార్పార్టీ అయింది ఎస్పిపై ప్రధాని మోడీ విసుర్లు
- Advertisement -
- Advertisement -
- Advertisement -