నెటిజెన్ల నుంచి అనూహ్య స్పందన
పెగాసస్పై వివరణ ఇవ్వాలని సూచన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 15న జాతినుద్దేశించి ఇవ్వనున్న సందేశంపై పౌరుల నుంచి సూచనల్ని ఆహ్వానించారు. ‘ప్రధాని చేయనున్న ప్రసంగానికి మీ దగ్గరున్న ఆలోచనల్ని షేర్ చేయండి. మీ ఆలోచనలు ఎర్రకోట నుంచి ప్రతిధ్వనిస్తాయి’ అంటూ ప్రధాని కార్యాలయం ట్విట్ చేసింది. దీనికి నిమిషాల్లోనే అనూహ్య స్పందన వచ్చింది. పలువురు నెటిజెన్లు పలు సూచనలు చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపైనా వివరణ ఇవ్వాలని పలువురు కోరడం గమనార్హం. పెగాసస్ స్పైవేర్పై పార్లమెంట్లో కేంద్రాన్ని ప్రతిపక్షాలు నిలదీస్తున్న అంశంపైనా ప్రధాని స్పందించాలని నెటిజన్లు కోరారు.
పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రకటించాలని సుమీత్మెహతా అనే వ్యక్తి సూచించారు. చిన్నారులే దేశ భవిష్యత్. వారంతా పాఠశాలలకు తిరిగి రావాలి. భవిష్యత్ కోసం మీరివ్వగల గొప్ప బహుమతి అవుతుందంటూ ఆయన ట్విట్ చేశారు. జనాభా పెరుగుదల దేశ అతిపెద్ద సమస్యగా మారుతోంది. రానున్న కొన్నేళ్లలోనే దేశ జనాభా 150 కోట్లకు చేరనున్నది. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దీనిపై మీరు ఓ సందేశమివ్వాలంటూ ఆకాశ్సింగ్ అనే మరో వ్యక్తి సూచించారు. పెగాసస్ స్పైవేర్పై వివరణ ఇవ్వాలని, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని, పెట్రోల్,డీజిల్ ధరలు పెరగడంపై, వ్యవసాయ చట్టాలపైనా వివరణ ఇవ్వాలని పలువురు ప్రధానికి సూచించారు.