న్యూఢిల్లీ: మలేసియాకు పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఎనిమిది మంది విదేశీయులు ఆదివారం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పట్టుబడ్డారు. వీరందరినీ మలేసియా జాతీయులుగా గుర్తించారు. ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన తబ్లిగీ జమాత్ సదస్సులో పాల్గొన్న వీరంతా ఆ తర్వాత ఆచూకీ తెలియకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు భావిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భారత్నుంచి మలేసియాకు సహాయక సామగ్రి, కొంతమంది మలేసియన్లతో మిలిందో ఎయిర్వేస్ విమానం బయలుదేరుతున్న సమాచారం తెలుసుకొన్న ఈ ఎనిమిది మంది ఆ విమానంలో పారిపోవాలని ప్లాన్ వేశారు. ఢిల్లీలో తలోచోట దాక్కున్న వీరంతా ఆదివారం మధ్యాహ్నం విమానాశ్రయం వద్దకు చేరుకున్నట్లు ఎయిర్పోర్టు అధికారులు చెప్పారు.
అయితే తబ్లిగీ జమాత్ సదస్సుకు హాజరైన విదేశీయుల్లో చాలా మంది ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్న నేపథ్యంలో సమావేశంలో పాల్గొన్న దాదాపు 960 మంది విదేశీయుల వీసాలను రద్దు చేసి బ్లాక్లిస్టులో పెట్టిన అధికారులు ఇప్పటికీ దేశంలో దాన్ని ఉన్న వారి కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలో ఇమిగ్రేషన్ అధికారులు వీరిని అడ్డుకుని విమానంనుంచి దింపి వేయడమే కాకుండా పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులుకు సమాచారం ఇవ్వడంతో వారు ఈ ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మార్చి మొదటివారంలో నిజాముద్దీన్లో జరిగిన సదస్సుకు హారయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు వీరిని ప్రశ్నిస్తున్నారు. అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు.